గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళి సై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. కాగా, 2019, సెప్టెంబ‌రు 8న తెలంగాణ రాష్ట్ర గ‌వర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌ర్వాత కాలంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్‌.. త‌న రాజీనామా ప‌త్రాల‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పంపించిన‌ట్టు రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి. బీజేపీ త‌మిళ‌నాడు శాఖ అధ్య‌క్షురాలిగా గ‌తంలో ప‌నిచేసిన త‌మిళి సై.. ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌పై గ‌ట్టి ప‌ట్టు పెంచుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుత‌ లోక్ సభ ఎన్నికల బరిలో తమిళిసై పోటీ చేయ‌నున్నార‌ని ఆ రాష్ట్ర బీజేపీ వ‌ర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇలాంటి చ‌ర్చ‌ వచ్చిన‌ప్పుడ‌ల్లా అలాంటిదేమీ లేదని త‌మిళి సై చెబుతూ వ‌చ్చారు.

కానీ, కేంద్రంలోని బీజేపీపెద్ద‌ల నుంచి వ‌చ్చిన సూచ‌న‌లు, త‌మిళ‌నాడులో బీజేపీ పుంజుకున్న తీరు వంటి వాటి నేప‌థ్యంలో ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేశార‌ని, త్వ‌ర‌లోనే ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు నుంచి తమిళిసై లోక్ సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తమిళిసై నాడార్ సామాజిక వర్గానికి చెందిన ఆమె వృత్తి గ‌తంగా ఎంబీబీఎస్ వైద్యురాలు. ఇక‌, సామాజిక వ‌ర్గం ప‌రంగా నాడార్ ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తమిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉంది.