మోడీ.. రింగ్ మాస్టర్ :  మోడీపై ష‌ర్మిల ఫైర్‌

ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకే ఒరలో రెండు కత్తులు అని ప్రధాని నరేంద్ర మోడీ చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన `ప్ర‌జాగ‌ళం` స‌భ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. వైసీపీ తన వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. అయితే.. మోడీ చేసిన ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై  ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అటు జగన్ ను, ఇటు బాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ మోడీ అని షర్మిల విమర్శించారు.

పదేళ్ల‌పాటు ఏపీ వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా? కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? అని ష‌ర్మిల నిప్పులు చెరిగారు. “ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకుండా, పైగా వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది ఎవరు? ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పు తెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు(జ‌గ‌న్‌ను మోడీకి ద‌త్త‌పుత్రుడు అంటూ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఓ సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు) అన్నది ఎవరినో?” అంటూ షర్మిల ప్ర‌ధాని మోడీపై ఫైర‌య్యారు.

“పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ పార్టీ సిగ్గువిడిచి మద్దతు ఇచ్చింది. మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టి, వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు. ఇదీ… వీరి స్నేహం, విడదీయరాని బంధం!“ అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఏపీకి విభ‌జ‌న స‌హా ప్ర‌త్యేక హోదా , వెనుక బ‌డిన రాష్ట్రాల నిధులు వంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అన్న కారణంతో వాటిని బీజేపీ, టీడీపీ, వైసీపీ తుంగలో తొక్కాయన్నారు.

ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రెస్ పై పసలేని దాడులు చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టా రు. “మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా?“ అంటూ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కాగా, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై సీపీఎం, సీపీఐ లు కూడా పెద‌వి విరిచాయి. విభ‌జిత రాష్ట్రానికి ఏమిస్తారో చెప్ప‌కుండా.. మొక్కుబ‌డి ఉప‌న్యాసాల‌తో మోడీ మురిపించార‌ని వ్యాఖ్యానించాయి.