కాంగ్రెస్‌-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదు: మోడీ

ఏపీలో కాంగ్రెస్‌-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కావ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పారు. చిల‌క‌లూరి పేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తొలుత తెలుగు లో ప్ర‌సంగించారు. కోట‌ప్ప‌కొండ ప్రావ‌స్త్యాన్నివివ‌రించారు. త్రిమూర్తుల ఆశీర్వాదం త‌న‌కు, ఏపీకి కూడా ఉంద‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న హిందీలో త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 దాటాలి, ఎన్డీఏకు ఓటు వేయాలి అని ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగించారు. మనం నెగ్గితేనే వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ అన్నారు. జూన్ 4న రాబోయే ఫలితాలలో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం సుదీర్ఘ‌కాలంగా కృషి చేస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు. రాష్ట్రంలో మనం గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం అవుతుంద‌ని తెలిపారు. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఈ పల్నాడు జిల్లాలో దాదాపు 5 వేల ఇళ్లు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది“ అని కేంద్ర పథ‌కాల‌ను ఏపీకి ఎలా ఇచ్చిందీ ప్ర‌ధాని వివ‌రించారు.

ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌(విద్య‌ల‌కు కేంద్రం)గా మార్చామ‌న్నారు. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామ‌ని, తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించామ‌ని ప్ర‌ధాని వివ‌రించారు. మంగళగిరిలో ఎయిమ్స్, విజయనగరంలో గిరిజ‌న యూనివ‌ర్సిటీ లాంటి ఎన్నో ఏర్పాటు చేశామ‌న్నారు. ఎన్డీఏలోని ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటారని చెప్పారు. ఏపీలో నీలి విప్లవానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని.. యువతకు, మహిళలకు ఉద్యోగాలతో పాటు కొత్త అవకాశాల కల్పనకు ప్లాన్ చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.

ఓ రాష్ట్రంలో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు పోటీ పడతాయి. కేంద్రంలో వాళ్లు కలిసిపోయామని చెప్పడం ప్రజలు గుర్తించాలి అని మోడీ అన్నారు. దివంగత నేత, మహానటుడు నందమూరి తారక రామారావును ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయ‌న రాముడు, కృష్ణుడు పాత్ర‌ల్లో జీవించార‌ని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశామన్నారు. మరో తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ తమ ప్రభుత్వం గౌరవించుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తుచేశారు.