మేం మీ వెంట ఉంటాం:  మొడీ తో చంద్రబాబు

జెండాలు వేరైనా మూడు పార్టీల‌(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) అజెండా మాత్రం ఒక్క‌టేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. చిల‌క‌లూరిపేట‌లోని బొప్పూడిలో నిర్వ‌హించిన ఎన్డీయే కూట‌మి ప‌క్షాల తొలి బ‌హిరంగ స‌బ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏదే గెలుపు అని, ఎవరికీ సందేహం లేదని అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ కార‌ణంగానే దేశానికి ప్ర‌పంచ స్థాయిలో పేరు వ‌స్తోంద‌ని తెలిపారు. “మోడీ ఒక వ్యక్తి కాదు.. భారత్‌ను విశ్వగురుగా మారుస్తున్న శక్తి. మోడీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మవిశ్వాసం“ అని కొనియాడారు

మోడీ బ‌ల‌ప‌రిచేందుకు మ‌నమంతా(ఏపీ ప్ర‌జ‌లు)సిద్ధంగా ఉన్నామ‌న్న విష‌యాన్ని క‌ర‌తాళ‌ధ్వ‌నుల ద్వారా ఆయ‌న‌కు తెలపాల‌ని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడి స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీల కార్య‌క‌ర్త‌లు, అబిమానులు త‌ర‌లి వ‌చ్చారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ… ఎన్డీయే కూటమికి అండగా ఉంటామని సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సైతం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

‘మూడు పార్టీల జెండాలు వేరైనా తమ అజెండా ఒక్కటే. అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి ప్రధాని మోడీ. సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పారు మోడీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రధాని మోడీ నినాదాలు. పేదరికం లేని భారత్ అనేది మోడీ కల అని మనకు తెలుసు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ప్రధాని మోడీ ఆశయాలతో మనమంతా ఏకం కావాలి. సరైన సమయంలో దేశానికి మోడీ లాంటి నేత ప్రధాని అయ్యారు’  అని చంద్రబాబు స‌భ‌లో క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య చెప్పుకొచ్చారు.

ప్ర‌ధానికి అర్థ‌మ‌య్యేలా..

ఈ సందర్భంగా తాను చెప్పేది మోడీకి అర్థం కావడానికి చంద్రబాబు హిందీలో ప్రసంగించారు. “నేను ఈ రోజు ఒకటే చెబుతున్నాను. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వికసిత్ భారత్ ద్వారా మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోడీ గారికే ఉన్నాయి. ప్రపంచంలోనే భారతీయులను ఒక శక్తిమంతమైన జాతిగా తయారు చేయడం కోసం మోడీ, అమిత్ షా కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మేం మీ వెంట ఉంటాం. ఈ మేరకు ఈ సభాముఖంగా మేం మాట ఇస్తున్నాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.