టీడీపీలో ఇంత జోష్‌కు వైసీపీయే రీజ‌న్‌…!

రాజ‌కీయాల్లో ఒక నేత అయినా.. ఒక పార్టీ అయినా.. హుషారుగా ఉంటే.. దానికి కార‌ణం.. ఆ నాయకుడైనా పుంజుకుని ఉండాలి. లేదా.. ఆ పార్టీ అయినా పుంజుకుని ఉండాలి. వీటికి.. ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌లు కూ డా తోడైతే.. ఇక‌, జోష్‌కు అంతు లేకుండా పోతుంది. ఇప్పుడు టీడీపీలో ఇదే జ‌రుగుతోంది. ఒక‌వైపు చంద్ర‌బాబు నాయ‌క‌త్వ‌పై రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉత్సాహం.. విశ్వాసం పార్టీకి బ‌లంగా మారాయి. ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని రెండు మూడు స‌ర్వేలు తేల్చి చెప్పాయి

తొలినాళ్ల‌లో బీజేపీతో క‌ల‌వ‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌ట్టినా.. త‌ర్వాత‌.. వ‌చ్చిన స‌ర్వేల ఫ‌లితాల‌తో టీడీపీపై నా.. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహంపైనా విశ్వాసం పెరిగింది. దీంతో ఎక్క‌డ విన్నా.. టీడీపీ గెలుపును రాసిపెట్టుకోవ‌చ్చ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. 94+34 మంది అభ్య‌ర్థుల తో జాబితాలు ప్ర‌క‌టించేసిన త‌ర్వాత‌.. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా ఎక్క‌డా పెద్ద‌గా వ్య‌తిరేక‌త రాక‌పోవ‌డం.. అది కూడా చ‌ల్లారిపోవ‌డంచంద్ర‌బాబు నాయ‌కత్వాన్ని మ‌రింత బ‌లోపేతం చేసింది.

క‌ట్ చేస్తే.. గ‌డిచిన 24 గంట‌ల్లో టీడీపీలో మ‌రింత ఉత్సాహం ఉర‌క‌లెత్తుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం వైసీపీ అంటున్నారు పరిశీల‌కులు. అదేంటి? అనే ఆశ్చ‌ర్యం క‌లగొచ్చు. కానీ, రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి కార్యాకార‌ణ సంబంధాలు కూడా పార్టీకి ఊత‌మిస్తాయి. వైసీపీ అభ్య‌ర్థుల జాబితాప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. పెద‌వి విరుపులు క‌నిపించాయి. భారీ స్థాయిలో మార్పులు ఉంటాయ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పినా.. బీసీల‌కు స‌గం సీట్లు ఇచ్చేశామ‌ని చెబుతున్నా.. ఇవి క్షేత్ర‌స్థాయిలో ఫ‌లితం ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టికెట్లు ప్ర‌క‌టించిన వారిలో టీడీపీ క‌న్నా ఎక్కువ‌గానే నిల‌య విద్వాంసులు క‌నిపించారు. బొత్స కుటుంబం నుంచి ధ‌ర్మాన కుటుంబం వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర‌లో భారీ సంఖ్య‌లో టికెట్లు ఇచ్చారు. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గానికి 49 స్థానాలు ఇచ్చేశారు. దీంతో జ‌గ‌న్ చెప్పిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్ చేసిన స‌ర్వేలు.. ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది. సో.. ఇది టీడీపీకి అనుకూలంగా మారింది. వైసీపీకంటే టీడీపీనే బెట‌ర్‌.. కుటుంబాల‌ను దాదాపు ప‌క్క‌న పెట్టి ఆశావ‌హుల‌కు టికెట్లు ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇదే టీడీపీలో మ‌రో జోష్‌కు కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.