ప్రవీణ్ డబల్ ట్విస్ట్ అదిరింది

బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే.. ఆయ‌న తీసుకున్న ఆక‌స్మిక నిర్ణ‌యం రాజకీయవర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వాస్త‌వానికి బీఎస్పీ పొత్తు పెట్టుకున్న వెంట‌నే ఆయ‌న‌కు కేసీఆర్ మంచి సీటు ఆఫ‌ర్ చేశారు. బీఎస్పీ త‌ర‌ఫున ఆయ‌న నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ద‌క్కింది. అయితే.. ఈ పొత్తు కుదిరి రెండు రోజులు కూడా కాకుండానే ఆయ‌న బీఎస్పీకి రిజైన్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముందుగానే కేసీఆర్ తో సంప్రదింపులు జరిపారు. తర్వాత మాయవతి ఎవరితోనూ పొత్తులు ఉండవని లక్నోలో ప్రకటించారు. కానీ తర్వాత.. కేసీఆర్ ఏ కూటమిలో లేనందున ఆయనతో పొత్తులు పెట్టుకునేలా ప్ర‌వీణ్‌కుమార్‌ ఒప్పించారు. ఈ మేరకు లక్నో నుంచి పార్టీ ప్రతినిధి వచ్చి కేసీఆర్ తో చర్చించారు. కేసీఆర్ హైదరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అధికారిక ప్రకటన కూడా చేశారు.

అయితే హఠాత్తుగా ప్రవీణ్ కుమార్ తన పార్టీకి రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న నేరుగా కేసీఆర్ ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌తో సమావేశమయ్యారు. కేసీఆర్ ఇస్తామన్న సీట్ల ప్రతిపాదనలతో మాయవతి సంతృప్తి చెందలేదని అందుకే పొత్తు వద్దన్నారని తెలిపిన‌ట్టు స‌మాచారం. మాయవతి నిర్ణయంతో అసంతృప్తికి గురైన ప్రవీణ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తరపునే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఐపీఎస్ అధికారిగా ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని .. రాజకీయాల్లోకి వచ్చారు. బీఎస్పీలో చేరి.. పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా శ్రమించారు. గత ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనుకున్న ఫలితాలను సాధించలేకపోయా రు. స్వయంగా సిర్పూరులో పోటీ చేసినా గెలవలేక పోయారు. అయితే బీఎస్పీని దళితల పార్టీగా మార్చే విషయంలో ఆయన గట్టిగా ప్రయత్నించారు. తాను ఐపీఎస్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రోత్సహించిన స్వేరో అనే సంస్థ ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. కానీ, అధికారం లేకపోతే.. కష్టమని భావించి.. ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు.

బీజేపీపై ఫైర్

బీఎస్పీకి రాజీనామా చేసిన స‌మ‌యంలో ప్ర‌వీణ్ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. ‘‘పొత్తు (బీఆర్ ఎస్‌-బీఎస్పీ) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దానిని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’’ అని ప్రవీణ్‌ కుమార్ పేర్కొన్నారు.