ఏపీలో వ‌లంటీర్ల‌ పై మరో సారి క్లారిటీ ఎన్నిక‌ల సంఘం

ఏపీలో ఎన్నిక‌ల విధులు, స‌హా ఇత‌ర‌త్రా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌కు కూడా వ‌లంటీర్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందేన‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వారిని ఎన్నిక‌ల విధుల‌కు అనుమ తించ‌బోమ‌ని చెప్పారు. వాస్త‌వానికి ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భు త్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సార‌థులుగా వారిని ప్రొజెక్టు చేసింది. ఇటీవ‌ల కాలంలో వారే ప్ర‌భుత్వానికి, వైసీపీకి ప్ర‌చార‌క‌ర్త‌లుగా మారిపోయారు. దీనిపై అనేక ఫిర్యాదులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరాయి.

కొన్నాళ్ల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్ప‌ట్లోనే ఎన్నిక‌ల సంఘం ఫైరైంది. వ‌లంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని పేర్కొంది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మ‌రోసారి కూడా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్లు స‌హా.. స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు కూడా ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది.

లోక్ సభ ఎన్నికలకు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఏపీలో వివాదాస్ప‌ద‌మైన వ‌లంటీర్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వ‌లంటీర్లు, తాత్కాలిక సిబ్బంది పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను కేవైసీ యాప్ లో చూడొచ్చని చెప్పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అక్రమాలు, నగదు పంపిణీలకు సంబంధించిన ఫొటోలను ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేయొచ్చని తెలిపారు.