మ‌రోసారి గెలిపించండి: మోడీ

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప్రారంభం కానున్న స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి బ‌హిరంగ లేఖ రాశారు. దేశ ప్ర‌జ‌ల‌ను త‌న కుటుంబంగా పేర్కొన్న ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి త‌న‌ను గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. అన్ని వ‌ర్గాల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు త‌మ ప్ర‌భుత్వం ఎంతో కృషి చేసింద‌ని వివ‌రించారు. త‌న‌ నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన‌ కీలక విజయాలను, ప్ర‌వేశ పెట్టిన అనేక ప‌థ‌కాల‌ను ఈ లేఖ‌లో ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

దేశ ప్ర‌జ‌ల‌ను మోడీ త‌న కుటుంబంగా పేర్కొన్నారు. ప‌ది సంవ‌త్స‌రాల పాటు భారతదేశ పౌరులకు సేవ చేసే అవ‌కాశం క‌ల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, మద్దతును మ‌రువ‌లేన‌ని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల వారి జీవన ప్ర‌మాణాల‌ను మెరుగుపరచడానికి కట్టుబడి ప‌నిచేసిన‌ట్టు తెలిపారు. ఈ ప‌ది సంవ‌త్స‌రాల్లో అనేక కీల‌క ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసిన‌ట్టు వివ‌రించారు.

గడిచిన ప‌దేళ్ల కాలంలో అనేక చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు న‌రేంద్ర మోడీ త‌న లేఖలో వివ‌రించారు. జిఎస్‌టి అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై కొత్త చట్టం, పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే చ‌ట్టం, తీవ్రవాదం, న‌క్స‌లిజం అణిచివేత వంటి విష‌యాల్లో నిర్ణయాత్మక చర్యలతో సహా ప్రభుత్వం తీసుకున్న అనేక చారిత్రక, ముఖ్యమైన నిర్ణయాలు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనే చేప‌ట్టిన‌ట్టు ప్ర‌ధాని వివ‌రించారు. దేశ సంక్షేమం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, దేశ అభివృద్ధి కోసం ఆకాంక్షించే ప్రణాళికలను సాకారం చేయడానికి ప్రజల మద్దతు తనకు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని భావిస్తున్నాన‌న్నారు.

ఇదే త‌న‌కు మ‌రోసారి అధికారం ఇస్తుందని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ప్రతి పౌరుడికి ఉజ్వల భవిష్యత్తు ఉండాల‌ని అభిల‌షిస్తున్న‌ట్టు తెలిపారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించ‌డంలో దేశ సామూహిక సామర్థ్యంపై విశ్వాసం ఉంద‌న్నారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ సుదీర్ఘ లేఖలో వివ‌రించారు.