ముగ్గురు మొనగాళ్ళు `ప్ర‌జాగ‌ళం`:  పోస్ట‌ర్ విడుద‌ల‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి స‌భ‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వ‌హించా ల‌ని ప్లాన్ చేశారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. టీడీపీ, జ‌న‌సేన సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.  టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ భూమి పూజ చేసి.. కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగో/పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోడీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు. ప్రజాగళం సభ ద్వారా మోడీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాయి.

కాగా, ఈ పోస్ట‌ర్‌పై “ల‌క్ష‌లాదిగా త‌ర‌లి రండి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుపున‌ర్నిర్మించుకుందాం.. విధ్వంసం నుంచి వికాసానికి అడుగేద్దాం“ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. సుమారు 10ల‌క్ష‌ల మంది అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు(మూడు పార్టీలు) వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన స‌భా ప్రాంగ‌ణాన్ని విశాలంగా తీర్చి దిద్ద‌డంతోపాటు.. ప్ర‌తి రెండు మీట‌ర్ల దూరానికి ఎల్ ఈడీ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేశారు. స‌భ‌కు ముందు కూర్చునేందుకు ల‌క్ష‌కు పైగా కుర్చీల‌ను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా వెయ్యి కి పైగా గ్యాల‌రీల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాల‌రీలో 5 నుంచి ప‌ది వేల మంది నిల‌బ‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా వ‌చ్చిన వారికి  తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మ‌జ్జిగ ప్యాక‌ట్ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ స‌భ‌కు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని అంచ‌నా.