బీజేపీలో గందరగోళం పెరిగిపోతోందా?

బీజేపీ నేతల్లో గందరగోళం పెరిగిపోతోంది. ఈ గందరగోళం ఎందుకంటే టీడీపీ అధినేత ప్రకటించిన రెండోజాబితా విషయంలోనట. ఎందుకంటే తాము పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారట. అందుకనే చంద్రబాబు పొత్తుధర్మాన్ని పాటించటంలేదంటు గోలపెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము పోటీచేయాలని అనుకోవటం వేరు, తమకు కేటాయించిన నియోజకవర్గాలు వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోతున్నారు. పొత్తులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేయాలి, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏమిటనే విషయంలో టీడీపీ, జనసేనలో క్లారిటి ఉంది.

క్లారిటిలేనిది బీజేపీ నేతల్లోనే. ఎందుకంటే బీజేపీకి కేటాయించిన సీట్ల జాబితా కేంద్ర నాయకత్వం దగ్గరుంది. ఆ జాబితా బహుశా రాష్ట్ర నాయకులకు తెలియకపోవచ్చు. తెలిసిన బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బయటపెట్టలేదేమో. ఇక్కడ బీజేపీ నేతలు అభ్యంతరాలు ఏమిటంటే మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ నుండి పోటీచేయాలని అనుకున్నారట. పొత్తు కుదరకముందే రాజమండ్రి అర్బన్ సీటులో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించేసింది. తాజాగా రూరల్ నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్ ను టీడీపీ ప్రకటించింది. దాంతో వీర్రాజుకు షాక్ తగిలింది.

శ్రీకాళహస్తిలో బీజేపీ నేత కోలా ఆనంద్ పోటీకి రెడీ అయ్యారు. అయితే ఈ సీటులో బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ ప్రకటించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేసేందుకు  బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ రెడీ అయ్యారు. ఇల్లిల్లు తిరిగి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నుండి టీడీపీ గళ్ళా మాధవిని ప్రకటించేసింది. అలాగే మదనపల్లిలో బీజేపీ పోటీచేయాలని అనుకుంటే ఇక్కడి నుండి షాజహాన్ భాషాను అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించింది.

ఇపుడు కమలనాదుల బాధేమిటంటే పార్టీకి పట్టుందని అనుకుంటున్న సీట్లన్నింటినీ టీడీపీ తీసేసుకుని ఓడిపోతుందని అనుకుంటున్న సీట్లను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందట. ఇక్కడే బీజేపీ నేతల అభ్యంతరాలు వినటానికే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబుతో గజేంద్రసింగ్ షెకావత్, పాండా దాదాపు 8 గంటలు చర్చలు జరిపారు. పోటీచేసే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేసుకున్నారు. తర్వాతే చంద్రబాబు రెండోజాబితాను ప్రకటించారు. సమస్యేమైనా ఉంటే అది పార్టీ పెద్దలతో తేల్చుకోవాలి కాని టీడీపీ మీద ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తే  ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి.