కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట‌.. బాబు మార్క్ జాబితా!

తాజాగా టీడీపీ ప్ర‌క‌టించిన రెండో జాబితాలో వార‌సుల‌కు, కోడ‌ళ్ల‌కు, కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి వ‌చ్చే ఎన్నిక‌లు కీలకంగా మార‌డం.. బ‌ల‌మైన వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్న వ్యూహంతోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌ళ్ల‌కు పెద్ద‌పీట వేసి.. కుటుంబాల నేత‌ల‌కు వీర‌తాళ్లు వేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలోని రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి పుట్ట‌ప‌ర్తి. ఇక్క‌డ నుంచి మాజీ మంత్రి పల్లె ర‌ఘునాథ‌రెడ్డి కోడ‌లు.. ప‌ల్లె సింధూరకు టికెట్ ఇచ్చారు. ఇక‌, ఇదే హిందూపురం పార్ల‌మెంటు ప‌రిధిలోన మ‌రో నియోజ‌క‌వ‌ర్గం క‌దిరి. ఇక్క‌డ నుంచి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ స‌తీమ‌ణి య‌శోదాదేవికి అవ‌కాశం క‌ల్పించారు.

ప‌ల్లె వ‌యోవృద్ధుడు కావ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని గ‌త ఎన్నిక‌ల్లోనే భావించారు. అయితే.. చివరి ఛాన్స్ అంటూ ఆయ‌న కోరుకోవడం తో అప్ప‌ట్లో టికెట్ ఇచ్చారు. ఇక‌, ఆయ‌న ఓట‌మి త‌ర్వాత‌.. జేసీవ‌ర్గం ఇక్క‌డ పుంజుకుంది. ఈ నేప‌థ్యంలో ప‌ల్లెకు ఇవ్వొద్ద‌ని పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో బ‌య‌టి వారికి ఇవ్వ‌డం ఇష్టం లేక .. ప‌ల్లె కోడ‌లు సింధూర‌కే టికెట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, కందికుంట క‌దిరి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, ఆయ‌న‌పై ప‌లు కేసులు ఉన్నాయి. నామినేష‌న్ల స‌మయంలో ఇవి అడ్డం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న సతీమ‌ణి య‌శోద‌కు టికెట్ కేటాయించారు. ఇరువురు మ‌హిళ‌లు కావ‌డం.. పైగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తొలిసారి పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే. ఇద్ద‌రూ ఓసీలే కావ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని రెండు స్థానాల్లో చంద్ర‌బాబు త‌న మార్కు ప్ర‌ద‌ర్శించారు. శ్రీకాళ‌హ‌స్తి సీటును పార్టీ వెట‌ర‌న్ దివంగ‌త బొజ్జ‌ల గోపాల కృష్నారెడ్డి త‌న‌యుడు సుధీర్‌కే ఇచ్చి.. మిత్రుడి ఆత్మ‌కు శాంతి చేకూర్చారు. ఆది నుంచిఈ టికెట్‌పై భారీ టెన్ష‌న్ నెల‌కొంది. అయినా కూడా చంద్ర‌బాబు సుధీర్‌కు చాన్స్ ఇచ్చారు. దీనిని పొత్తులో భాగంగా బీజేపీ కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. అయినా.. చివ‌రి నిముషంలో సుధీర్‌కు కేటాయించారు.

ఇక‌, మ‌రో నియోజ‌క‌వ‌ర్గం స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ వైసీపీ నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన కోనేటి ఆదిమూలంకు చంద్ర‌బాబు వీర తాడు వేశారు. ఆయ‌న‌కు వైసీపీ చిత్తూరు ఎంపీ స్థానం ఇవ్వ‌డంతో అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈక్ర‌మంలో టీడీపీలో చేరారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింది. తాజా జాబితాలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.