కీల‌క నేత‌లు చేతులు క‌ల‌పందే సైకిల్ పుంజుకుంటుందా?

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. 34 మందితో రెండో అసెంబ్లీ అభ్య‌ర్థుల‌ జాబితాను ప్ర‌క‌టించారు. దీనిలో కీల‌క నేత‌ల‌కు చాలా మందికి టికెట్ ఇవ్వ‌లేదు. అయితే.. వీరంతా ఏమీ ఆషామాషీ నాయ‌కులు కాదు. టికెట్ ద‌క్కించుకోని వారిలో చాలా మంది బ‌ల‌మైన నాయ‌కులు, సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా.. పేరున్న నేత‌లు కావ‌డం విశేషం. మ‌రి మార్పులు అయితే చేశారు. కొత్త ముఖాల‌కు చోటైతే ఇచ్చారు. కానీ, పాత కాపుల స‌హ‌కారం లేక‌పోతే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త‌వారు గెలుస్తారా? అనేది ప్ర‌శ్న‌.

ఉదాహ‌ర‌ణ‌కు..

పెద‌కూర‌పాడు: గుంటూరు జిల్లాలోని రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో ఉన్ని నియోజ‌క‌వ‌ర్గం.. ఇక్క‌డ నుంచి రెండు సార్లు కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ గెలుపు గుర్రం ఎక్కారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఈయ‌న టికెట్ ఆశించారు. టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులుకు స్వ‌యానా వియ్యంకుడు. పార్టీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం క‌మ్మ నేత‌. ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్నాడు. కానీ, ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి.. భాష్యం విద్యాసంస్థ‌ల అధినేత ప్ర‌వీణ్‌కు చాన్స్ ఇచ్చారు. ఈయ‌న మాస్ నేత కాదు. కేవ‌లం పార్టీలో నాయ‌కుడు. మ‌రి కొమ్మాల పాటి స‌హ‌కారం లేకుండా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతారా? అనేది ప్ర‌శ్న‌.

కోవూరు: నెల్లూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున తాజాగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌తీమ‌ణి వేమిరెడ్డి ప్ర‌శాంతికి అవ‌కాశం ఇచ్చారు. కానీ, ఇక్క‌డి టికెట్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పోలంరెడ్డి శ్రీనివాస‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈయ‌న 2014లో టీడీపీ త‌రపున ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. ఈయ‌న‌ను ప‌క్క‌న పెట్టి ప్ర‌శాంతికి అవ‌కాశం ఇచ్చారు. ఈమె ఇటీవ‌లే వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరి టికెట్ ద‌క్కించుకున్నారు. మ‌రి పోలంరెడ్డి స‌హ‌క‌రిస్తారా?

కందుకూరు: ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంటూరి నాగేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు టికెట్ ఖరారు చేశారు. కానీ, ఈ టికెట్‌ను పోతుల రామారావు కోరుకుంటున్నారు. ఈయ‌న 2014లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. యువ‌గ‌ళం కోసం నిదులు ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న‌ను త‌ప్పించి.. నాగేశ్వ‌ర‌రావుకు అవ‌కాశం ఇచ్చారు. దీంతో రామారావు స‌హ‌కారం అందించ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రొద్దుటూరు: క‌డ‌ప జిల్లాలోని ముఖ్య నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి పాత నేత వ‌ర‌ద‌రాజుల రెడ్డికి చంద్ర‌బాబు చాన్స్ ఇచ్చారు. అయితే.. ఈయ‌న గ‌త ఐదేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన మ‌ల్లెల లింగారెడ్డి మాత్ర‌మే పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న‌కు టికెట్ లేదు. కానీ, ఈయ‌న వ‌ర్గం టికెట్‌పై ఆశ‌లు పెట్టుకుంది. చివ‌రి నిముషంలో చేసిన మార్పుతో వ‌ర‌ద‌రాజులు టికెట్ ద‌క్కించుకున్నారు. దీంతో సొంత పార్టీలోనే రెండు వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేస్తాయా? అనేది ప్ర‌శ్న‌. గ‌త ఎన్నిక‌ల్లో వ‌ర‌ద రాజులు త‌న‌ను ఓడించార‌నేది లింగారెడ్డి ఆరోప‌ణ‌. ఇప్పుడు ఆక‌సి తీర్పుకోర‌నే గ్యారెంటీ లేదు. ఇలా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పు కొంత వ్య‌తిరేక‌త‌కు దారితీసే అవ‌కాశం క‌నిపిస్తోంది.