#WhoKilledBabi కు 5 ఏళ్ళు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి 2019 ఎన్నికల సమయంలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. అంత పాశవికంగా ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్నది ఇప్పటికీ తేలకపోవడం శోచనీయం.

మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు మిస్టరీలా మారింది.? ఈ చిక్కుముడిని సీబీఐ సైతం ఎందుకు విప్పలేకపోతోంది.? వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారా.? ఆయనకు వేరే మహిళతో అక్రమ సంబంధం వుందా.?

కడప ఎంపీ టిక్కెట్టుని ఆశించడం వల్లే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారా.? ఇంకేవైనా వేరే కారణాలు వివేకానంద రెడ్డి హత్య వెనుక వున్నాయా.? దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినా సీబీఐ, ఈ కేసులోని చిక్కు ముడులను విప్పలేకపోతోందంటే, ఆశ్చర్యకరమే అది.

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె న్యాయ పోరాటం వల్లనే, ఈ కేసు ఇంకా సజీవంగా వుంది. అసలంటూ ఆమె గట్టిగా నిలబడటం వల్లే, గుండె పోటు వ్యవహారం కాస్తా, గొడ్డలి పోటు అని తేలింది. అత్యంత కిరాతకంగా దుండగులు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే, అత్యంత భయానకమైన రీతిలో వున్న క్రైమ్ సీన్‌ని చూసి, గుండె పోటుగా తొలుత ఎందుకు ప్రచారం చేశారన్నదే ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం.

ఏళ్ళకేళ్ళు గడచిపోతున్నా, డెత్ మిస్టరీ అయితే వీడటంలేదు. ఐదేళ్ళు అంటే చిన్న విషయం కాదు. మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి హత్యకు గురైతే, ఆ కేసులో నిజానిజాలు తేలేందుకు ఐదేళ్ళు సరిపోనప్పుడు సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది.?

2019 ఎన్నికల సమయంలో హత్య జరిగితే, 2024 ఎన్నికల సమయంలో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. కానీ, నిజాలు నిగ్గుతేలడంలేదు. ఈ జాప్యానికి కారణమెవరు.? అసలు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో రాజకీయంగా లాభం పొందినదెవరు?