ఫిక్స్‌.. మ‌ల్లారెడ్డి కూడా జంపే!

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయ‌న‌ అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జంప్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వారు బీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే.. కొన్ని రోజుల కింద‌ట‌ భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. త‌ర్వాత ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం అయింది.

హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో మ‌ర్రి రాజ‌శేఖ‌రరెడ్డి కి ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. కాగా, ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని.. త‌ను కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా? అంటూ.. మ‌ల్లారెడ్డి అప్ప‌ట్లో ఫైర్ అయ్యారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మైపోయింది. వాస్త‌వానికి తాము కాంగ్రెస్ లోకి వెళ్లేది లేద‌ని మ‌ల్లారెడ్డి చెప్పారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. పార్టీలోనే ఉంటున్నట్టు సంకేతాలు పంపించారు. అయితే, అనూహ్యంగా మ‌ల్లారెడ్డి ఆయ‌న అల్లుడు యూట‌ర్న్ తీసుకున్నా రు. తాజాగా బెంగ‌ళూరులోని ఓ హోట్ లో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు, క‌ర్ణాట‌క పార్టీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌తో వారు భేటీ అయ్యారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు కూడా డీకే శివ‌కుమార్‌తో మాట్లాడుతున్న‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి వారు పార్టీ మారుతున్న‌ట్టుగా స్ప‌ష్టం గా తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యాపారాలు విస్త‌రించి ఉండ‌డం.. మ‌రో ఐదేళ్ల‌పాటు వాటిని కాపాడుకునే ప‌రిస్థితి ఉండ‌డం.. రాజ‌కీయంగా ఎదురు దెబ్బ‌లు తిన‌లేని ప‌రిస్తితి నెల‌కొన‌డం కార‌ణంగా మ‌ల్లారెడ్డి మాన‌సికంగా రెడీ అయిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. తాజా ప‌రిణామాలు కూడా దానికి ఊత‌మిస్తున్నాయి ఈ నేప‌థ్యంలో డీకేతో భేటీ మ‌రింత‌గా ఈ వాద‌న‌ను స‌మ‌ర్థిస్తోంది. సో.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందే మ‌ల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.