వైఎస్ షర్మిల మౌనం దేనికి సంకేతం.?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చారు వైఎస్ షర్మిల. వస్తూనే, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ విభాగం అధ్యక్షురాలిగా అవకాశమూ దక్కించుకున్నారు. అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేశారామె. ఓ దశలో వైసీపీ తెలంగాణ పగ్గాలు ఆమె చేపడతారనే ప్రచారమూ జరిగింది. అయితే, తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన తర్వాత.. కాస్త గ్యాప్ తీసుకుని, తెలంగాణలో కొత్త జెండా, ఎజెండాతో కొత్త రాజకీయ పార్టీని వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా మూణ్ణాళ్ళ ముచ్చటగానే అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేక, చేతులెత్తేసి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు షర్మిల. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేశారు. ఇంతా చేసి వైఎస్ షర్మిల దక్కించుకున్నది ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఓ పదవి.

ఏపీసీసీ అధ్యక్షురాలు అవుతూనే, వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ, జగన్ మీద విమర్శల దాడి చేస్తూ వార్తల్లోకెక్కిన వైఎస్ షర్మిల, ఈ మధ్య కాస్త మౌనం దాల్చారు. కుమారుడి పెళ్ళి అనంతరం వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా కొంత నెమ్మదించడం (రాజకీయ కోణంలో) పలు అనుమానాలకు తావిస్తోంది.

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైన దరిమిలా, వైసీపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవనుందా.? అన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సానుకూలతా కనిపించలేదు. కానీ, తెరవెనుక వ్యవహారాలు శరవేగంగా మారుతున్నాయట.

వైఎస్ జగన్ స్వయంగా తన చెల్లెలు షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారంటూ టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. వైసీపీ – కాంగ్రెస్ గనుక కలిస్తే, అది వైసీపీకి కొంత అదనపు బలం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో.