ఈసారి ‘తూర్పు’ అంత ఈజీ కాదు జగన్

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఒకేసారి జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ మ‌రోసారి ప్ర‌యత్నం చేస్తోంది. అయితే.. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా.. తూర్పు గోదావ‌రి వంటి కీల‌క‌మైన జిల్లా మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ జిల్లాలోని రాజ‌కీయాలు, నేత‌లు, అసెంబ్లీ స్థానాలు అధికారంలోకి వ‌చ్చే పార్టీకి పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తాయి. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో మొత్తంగా 19 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు ద‌క్కించుకున్న పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే సెంటిమెంటు ఉంది.

ఇదే.. గ‌త కొన్నాళ్లుగా సాగుతున్న సెంటిమెంటు కూడా. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ వ‌ర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య జ‌రిగిన పోరులో రాజ‌మండ్రి రూర‌ల్‌, సిటీ, పెద్దాపురం, మండ‌పేట నియోజ‌కవ‌ర్గా ల్లో తెలుగు దేశంపార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం రాజోలు నుంచి జ‌న‌సేన విజయం సాదించింది. అయితే, ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజోలు ఎమ్మెల్యే వైసీపీకి అనుకూలంగా మారారు. స‌రే.. ఇక్క‌డ మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజ‌యం సాధించింది. అంటే.. మొత్తం 19 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 చోట్ల గెలుపు గుర్రం ఎక్కింది.

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ విజ‌యం సాధించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నంతోనే ఉంది. కానీ, జ‌న‌సేన రూపం లో ఇక్క‌డ కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన కాపు సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో జ‌న‌సేన ఉంది. అయితే..ఈ వ్యూహం నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ‌ర్కవుట్ అయింది. కానీ, అనూహ్యంగా జ‌నసేన వెళ్లి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం.. పొత్తు కార‌ణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం 21 స్థానాల‌కే ప‌రిమితం కావడం వంటివి ఒకింత సెగ పెట్టించాయి.

ఈ ప‌రిణామాల‌తో జ‌న‌సేన పార్టీలో ఉన్న కాపు నాయ‌కులు స‌హా.. ఈ పార్టీలో చేరాల‌ని అనుకున్న నాయ కులు కూడా పార్టీకి దూర‌మ‌వుతున్నారు. మ‌రోవైపు, తెలుగు దేశం పార్టీతో పొత్తులో కార‌ణంగా సీట్లు కోల్పోయిన జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఉసూరు మంటున్నారు. వారికి న‌చ్చ జెప్పి.. ఏదో విధంగా బుజ్జ‌గించి వారిని లైన్‌లో పెట్టుకోవ‌ల్సిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మాత్రం వారిని మ‌రింత రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ కేటాయించిన టికెట్ల‌లో ఆ పార్టీకి టికెట్ రాని వారిని జ‌నసేన‌లోకి తీసుకుని.. టికెట్ ఇస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు భీమ‌వ‌రం ప్ర‌త్య‌క్ష ఎగ్జాంపుల్‌. దీంతో తూర్పుగోదావ‌రి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. ఏ పార్టీ ఓటు బ్యాంకు చీల కూడ‌ద‌ని భావిస్తున్నారో.. అదే పార్టీకి మేలు చేసేలా ప్ర‌స్తుత ప‌రిణామాలు మార‌డం గ‌మ‌నార్హం.