ఈ ముగ్గురిలో ఎవరికి వస్తాదో

మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయితీలు పెరిగిపోతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో డిసైడ్ అయ్యింది. అలాగే మూడు పార్టీలు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కూడా చాలావరకు నిర్ణయమైపోయాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్న కారణంగా పార్టీ నేతలకు చేరలేదు. అయితే లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు వచ్చేస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతల మధ్య పొలిటికల్ వేడి పెరిగిపోతోంది. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి

ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి మూడు పార్టీల నేతలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు. దాంతో పోటీ అనివార్యంగా పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెనాలిలో పోటీ చేయలేకపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో చెబితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దాంతో ఆలపాటి అలిగి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జనసేన తరపున పోటీచేయటానికి బోనబోయిన శ్రీనివాసయాదవ్ పేరు గట్టిగా వినబడుతోంది. ఎందుకంటే యాదవ్ చాలాకాలంగా పోటీచేసే ఉద్దేశ్యంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

అలాగే పొత్తులో కొత్తగా చేరిన బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ కూడా పశ్చిమ నియోజకవర్గంలో పోటీకి రెడీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్న కారణంగా బీజేపీ కూడా ప్రభాకర్ పోటీచేస్తే బాగుంటుందని సీటుకోసం గట్టిగా పట్టుబడుతోంది. సతీష్ 2014,19 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన అనుభవం ఉన్న నేత. కాబట్టి మూడో ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ప్రభాకర్ చాలా కాన్ఫిడెంటుగా చెబుతున్నారు.

వీళ్ళే కాకుండా ఇంకా కొందరు నేతలు కూడా టికెట్ కోసం ట్రై చేసుకుంటున్నారు. టీడీపీలో ఆలపాటికి పోటీగా గాళ్ళ మాధవీలత కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈమె టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకుంటున్నారు. మూడుపార్టీల నుండి ఇంతమంది పోటీపడుతున్న గుంటూరు పశ్చిమం నియోజకవర్గంలో సీటు ఏ పార్టీకి వెళుతుందో ? పోటీలో ఎవరుంటారో చూడాల్సిందే.