పోటీ చేస్తారా? టికెట్ ఇస్తాం.. ఫోన్ల‌కు మెసేజ్‌లు!

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్ప‌టికే వైసీపీ ఒంట‌రి పోరుకు సై అంది. ఇక‌, బీజేపీ, టీడీపీ. జన‌సేన క‌లిసి ఒకే యూనిట్‌గా పోటీకి దిగుతున్నాయి. ఇక‌, క‌మ్యూనిస్టులు-కాంగ్రెస్ పార్టీ క‌లిసి ముందుకు సాగు తున్నాయి. ఇవి ప్ర‌ధాన పార్టీలుగా బ‌రిలో ఉన్నాయి. అయితే.. ఇవి కాకుండా.. మ‌రో నాలుగు కీల‌క పార్టీలు బ‌రిలో ఉన్నాయి. వీటికి ఏ ఇత‌ర పార్టీల‌తోనూ పొత్తులు లేవు. అవే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, న్యాయ‌వాది జ‌డ శ్రావ‌ణ్ నేతృత్వంలోని జై భార‌త్ భీం రావ్ పార్టీ, మాజీ ఐపీఎస్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలోని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ.

ఇదే కాదు.. పొలిటిక‌ల్ క‌మెడియ‌న్‌గా అందరూ ప్రేమించే కిలారి ఆనంద పాల్ నేతృత్వంలోని ప్ర‌జాశాంతి పార్టీ, అంతేనా.. మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీలు.. ప్ర‌ధానంగా ఏపీలో ఉన్నాయి. ఇవి ఒంట‌రిగానే బ‌రిలో నిలుస్తున్నాయి. వైసీపీలో అయితే.. టికెట్లు ద‌క్క‌క ల‌బోదిబో మంటున్న నాయ‌కులు క‌నిపిస్తున్నారు. ఇక‌, టీడీపీ, జ‌న‌సేన‌ల్లోనూ టికెట్లు రాక ర‌చ్చ చేస్తున్న‌వారు కూడా ఉన్నారు. ఇక‌, పొత్తులో భాగంగా 10 సీట్ల‌కు ప‌రిమిత‌మైన బీజేపీ ప‌రిస్థితి కూడా అంత కాక‌పోయినా.. ఎంతో కొంత అసంతృప్తి ఉంది.

దీంతో ఆ నాలుగు పార్టీల్లోనూ టికెట్ల కోసం నాయ‌కులు పోటీ ప‌డుతున్నార‌నే చ‌ర్చుంది. కానీ, ఎటొచ్చీ.. కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు, ఇత‌ర పార్టీల విష‌యంలో మాత్రం టికెట్లు ఇంకా ఫిల్ కాలేదు. దీంతో కాంగ్రెస్ , క‌మ్యూనిస్టుల మాట ఎలా ఉన్నా.. ఇతర పార్టీలైన ప్ర‌జాశాంతి, జైభార‌త్ నేష‌న‌ల్‌, ఆప్, బీఎస్పీ పార్టీల నుంచి యువ‌త‌కు ఫోన్లు, మెసేజ్‌లు వ‌స్తున్నాయి. పోటీ చేస్తారా.. టికెట్ ఇస్తాం. యువ ర‌క్తాన్ని పారిస్తాం. మీ గెలుపున‌కు మాదీ భ‌రోసా అంటూ.. సందేశాలు పంపిస్తున్నారు.

ప్ర‌జాశాంతి పార్టీ అయితే.. మ‌రో అడుగు ముందుకు వేసి.. పార్టీలో జిల్లాకు రెండు సీట్లు మాత్ర‌మే ఖాళీ గా ఉన్నాయ‌ని.. పోటీ చేయాల‌ని అనుకుంటున్న యువ‌త పోటీ ప‌డాల‌ని.. లేటు చేస్తే టికెట్లు ఫిల్ అయిపోతాయ‌ని పాల్ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, జై భార‌త్ భీం పార్టీలో వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన నిందితుడు ద‌స్త‌గిరి చేరాడు. ఈయ‌న‌కు పులివెందుల టికెట్ కేటాయించారు. ఇక‌, కోడిక‌త్తి కేసులో నిందితుడు, ఇటీవ‌ల జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌నిప‌ల్లి శ్రీనివాస్‌కు.. అమ‌లాపురం టికెట్ ఇచ్చారు. బీఎస్పీ కూడా.. ఇదే బాట ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొతత్తానికి ఈ పార్టీల్లో అభ్య‌ర్థ‌ల కోసం వెతుకులాట మొద‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.