కేసీఆర్‌కు గుత్తా గుడ్ బై.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరిక‌!

కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ నేత‌, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డం దాదాపు ఖ‌రారైపోయింది. త్వ‌ర‌లోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో భువ‌నగిరి స్థానం నుంచి గుత్తా త‌న‌యుడు అమిత్ రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు కేటాయించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ టికెట్‌ను ఖ‌రారు చేసిన పార్టీ.. భువ‌నగిరి టికెట్‌ను పెండింగులో పెట్టింది. దీనిపైనే తాజాగా గుత్తా అమిత్ సీఎం రేవంత్ రెడ్డి స‌ల‌హాదారుతో భేటీఅ యి చ‌ర్చించారు.

దాదాపు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేయ‌డంతో గుత్తా తండ్రీత‌న‌యులు కేసీఆర్ కు గుడ్ బై చెప్పి.. రేవంత్ గూటికి చేర‌డం ఖాయ‌మైపోయింది. వాస్త‌వానికి సోమవారం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రాలేదు. అప్పుడే పార్టీలో వీరి గురించి లుక‌లుక‌లు వినిపించాయి. ఇక‌, మంగళవారం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమవ‌డంతో ఇక‌, వీరి చేరిక లాంఛ‌న‌మేన‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

నల్లగొండ టికెట్ ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డికి ప్రకటించింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా అమిత్‌కు ఈ టికెట్‌పై పార్టీ భ‌రోసా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు.. గుత్తాకు బీఆర్ఎస్ కూడా త‌క్కువేమీ చేయ‌లేదు. వారు కోరుకున్న చోట పోటీ చేయొచ్చ‌ని పేర్కొంది. నల్లగొండ లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనప్పటికీ… స్థానిక రాజకీయాల కారణంగా తండ్రీ త‌న‌యులు కాంగ్రెస్‌లోకి జంప్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తాకు రాజ‌కీయ విభేదాలు ఉన్నాయి. త‌మ‌కు టిక్కెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించదన్న కారణంగా వారు బయటకు రావాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయినా.. ఇప్పటికీ తెలంగాణ శాసనమండలిలో… బీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది. కీలకమైన బిల్లులు ఏమైనా మండలికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ వైపు మారిపోతే ఆ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు పార్టీ మారకుండా ఉండేందుకు కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నా వారి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.