పొత్తుల ఎఫెక్ట్‌.. సీఎం రిజైన్‌

హ‌రియాణ రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌రకు బాగానే ఉన్న ఈ రాష్ట్ర రాజ‌కీయాలు.. పార్ల‌మెంటు ఎన్నికల వేళ గాడి త‌ప్పాయి. అది కూడా.. కేవ‌లం ఒకే ఒక్క పార్ల‌మెంటు సీటు విష‌యంలో పొత్తు పార్టీల మ‌ధ్య నెల‌కొన్న వివాదం.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌భావం చూపి.. ఏకంగా ముఖ్య‌మంత్రి త‌న‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది.

ఏం జ‌రిగింది?

దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి చేరువ‌లో ఉన్న హ‌రియాణ‌లో బీజేపీ నేతృత్వంలో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతోం ది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హ‌రియాణ‌లో బీజేపీకి 41 సీట్లు ద‌క్క‌గా.. ఈ పార్టీకి మిత్రప‌క్షంగా ఉన్న జ‌న‌నాయ‌క్ జ‌న‌తాపార్టీ(జేజేపీ)కి 10 సీట్లు ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్య‌మంత్రిగా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌నోహ‌ర్ లాల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. వ‌చ్చే పార్ల‌మెంటుఎన్నిక‌ల్లో కూడా.. బీజేపీ-జేజేపీ క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకు న్నాయి. ఈ క్ర‌మంలో గ‌త రెండు రోజులుగా పొత్తుల‌పైనా.. సీట్ల షేరింగ్‌పైనా చ‌ర్చలు సాగుతున్నాయి. హ‌రియాణలో మొత్తం లోక్‌స‌భ సీట్లు.. 10 ఉన్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ 7 స్థానాల్లో నేరుగా గెలిచింది. మిగిలిన మూడు స్థానాల‌ను కాంగ్రెస్ ద‌క్కించుకుంది. అయితే.. త‌ర్వాత వారిని త‌న‌వైపు తిప్పుకొన్న బీజేపీ మొత్తంగా త‌న ఖాతాలో వేసుకుంది.

ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న జేజేపీ లోక్‌స‌భ సీట్ల‌లో షేర్ కోరుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీ పెద్ద‌లు ఒక సీటును ఆఫ‌ర్ చేశారు.కానీ, త‌మ‌కు మూడు సీట్లు ఇవ్వాల‌ని జేజేపీ కోరుతోంది. కానీ, బీజేపీ స‌సేమిరా అన‌డంతో జేజేపీ త‌న మ‌ద్ద‌తును ఉప‌సంహించుకుంది. దీనికి ముందే.. బీజేపీ సీఎం మ‌నోహ‌ర్‌తో రాజీనామా చేయించింది. అయితే.. ఈ రోజో రేపో .. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది. కాక‌పోతే.. స్వ‌తంత్ర స‌భ్యులుగా ఉన్న ఏడుగురిని క‌లుపుకొని ముందుకు సాగ‌నుంది.