ఏటి.. ఆ పార్టీలింకా ఉన్నాయా?

ఏటి.. ఆ పార్టీలింకా ఉన్నాయా? నాకైతే ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ముఖ్యం కాదని, తమకు నైతిక విలువే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ఎక్కడో ఒక‌టి రెండు చోట్ల ఉన్న టీడీపీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చ‌రిత్ర‌లో క‌లిసి పోతుంది. కనుమరుగు అవుతుంది అని అన్నారు. గతంలో బీజేపీని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా తిట్టారో రాష్ట్ర ప్రజలు చూశారని చెప్పారు. అదే విధంగా బీజేపీ నేతలు చంద్రబాబును కట్టప్పతో పోల్చడం నిజం కాదా అని ప్రశ్నించారు.

అధికారం కోసం ఆ మూడు పార్టీలు వెంపర్లాడుతున్నాయని.. అందుకే కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి బొత్స విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, కట్టప్ప లాంటి నేత చంద్రబాబు అని బీజేపీ నేతలు విమర్శించిన వీడియోలను ఈ సందర్భంగా బొత్స ప్రదర్శించారు. వైసీపీ ఏ పార్టీతోనూ పెట్టుకోదని, తమకు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. మూడు పార్టీలు కాదు, 30 పార్టీలు పొత్తు పెట్టుకున్నా వైసీపీని, జగన్‌ను ఏం చేయలేవని బొత్స ప్ర‌క‌టించారు.

బీజేపీతో కలిసిపోయారని గతంలో తమ పార్టీపై కొందరు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు అదే పార్టీ బీజేపీతో జత కట్టిందని ఎద్దే వా చేశారు. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు అని, వారి మద్దతుతో మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తామని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే వైసీపీ విధానమని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసిందన్నారు.

వైసీపీ పాలనతో మీకు మేలు జరిగిందని, మీ కుటుంబం పరిస్థితి మెరుగు పడిందని భావిస్తే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చార‌ని మంత్రి బొత్స తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్, ఉన్నత చదవులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సహా పలు పథకాలు అమలుతో మీకు మేలు జరిగితేనే తమకు మద్దతు తెలపాలని కోరారు. రైతులకు ఆర్థిక సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న నేత జగన్ అన్నారు. మా మేనిఫెస్టోలో పేర్కొన్న 95, 99 శాతం హామీలు నెరవేర్చామ‌న్నారు.

ఏం ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. ఏం హామీలు ఇచ్చారని ఎన్డీఏలో చేరారు అని చంద్రబాబును ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో గత వారం రోజులుగా పొత్తుల రాజకీయాలు జరుగుతున్నాయి. అధికారం దక్కించుకునేందుకు పొత్తుల కోసం కొన్ని పార్టీలు వెంపర్లాడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పొత్తుల కోసం ఢిల్లీకి వెళ్లి, ఎదురుచూసి మరి బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు. రాజకీయాల్లో పొత్తులు సహజమేనని, కానీ చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నేత అయినా, ఈ స్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.