కంగనా తల్లి ఆశా రనౌత్ కు బీజేపీ బంపరాఫర్

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని, తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కంగనా కోరిన వెంటనే కేంద్రం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇక, కంగనా ఆఫీసు కూల్చివేతపై గవరన్నర్ కోషియారీ ఏకంగా కేంద్రానికి నివేదిక పంపుతానని చెప్పారు. ఓ వైపు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని పీవోకేతో పోల్చిన కంగనా….ముంబై బ్రాండ్ ఇమేజ్ కు భంగం వాటిల్లుతున్నా బీజేపీ నేతలు నోరు మెదపలేదు. దీంతో, బీజేపీ ట్యూన్ కు కంగనా స్టెప్పులేస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలకు ఊతమిచ్చేలా కంగనా తల్లి ఆశా రనౌత్ కు బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. ఆశా రనౌత్ కు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉంటే బీజేపీలో చేరవచ్చని హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ చీఫ్‌ సురేష్‌కుమార్‌ కశ్యప్‌ చేసిన ప్రకటన ఇపుడు హాట్ టాపిక్ అయింది.

తన కూతురుకు వై ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించినందుకుగాను బీజేపీకి ఆశా రనౌత్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, హిమాచల్ ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు యోగక్షేమాలను పట్టించుకుంటున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇంతకు ముందు తాము కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులమే అయినా ఇప్పుడు బీజేపీ పట్ల అభిమానం పెరిగిందని ఆశా రనౌత్‌ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బీజేపీలో చేరాల్సిందిగా హిమాచల్‌ప్రదేశ్‌ బీజేపీ ఆహ్వానించింది. ఆల్రెడీ బీజేపీ మద్దతుదారు అయిన ఆశా రనౌత్‌ కు ఈ ఆఫర్ రావడంలో వింతేమీ లేదు. ఆశా రనౌత్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, ఆమెను బీజేపీలోకి ఆహ్వానించానని కశ్యప్ తెలిపారు. కంగనా పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, కంగనా వెనుకాల దేశం యావత్తు నిలుస్తుందని చెప్పారు.