‘వైసీపీ మ‌ళ్లీ వ‌స్తే.. రాయ‌ల‌సీమ రాజ‌స్థానే!’

“వైసీపీ మ‌ళ్లీ వ‌స్తే.. రాయ‌ల‌సీమ రాజ‌స్థానే!”అని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అని వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వ‌హించిన ‘శంఖారావం’ సభలో నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఒక్క రాయ‌ల సీమ నుంచే 53 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే ఉరవకొండలో 3వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తీసుకువస్తే… వైసీపీ ప్రభుత్వం కనీసం పదిశాతం పనులు కూడా చేయలేదన్నారు. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న నడిచిన నేల పచ్చగా మారిపోతుందని గ్రాఫిక్స్‌ జిమ్మిక్కులు చేశారని.. ఇప్పుడు రాయలసీమ ఎండిపోతోందని అన్నారు. కనీసం తాగడానికి గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఆరు నెలల్లో కొండలు, గుట్టలు మాయమయ్యాయని, వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమను దోచేశారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, సైన్స్‌ సిటీ పేరుతో వైసీపీ ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని.. కానీ, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి చెరువును నీటితో నింపుతామన్నారు. మెగా డ్రిప్ ఇరిగేషన్‌ పూర్తి చేసి ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తామని… హామీ ఇచ్చారు.

“జగన్ వచ్చిన తర్వాత..సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో తట్ట మట్టి ఎత్తలేదు. ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు. టీడీపీ వచ్చిన తర్వాత, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి సీమలో సిరులు పండిస్తాం. మరోసారి వైసీపీకి అధికారంలో ఇస్తే రాయలసీమ రాజస్థాన్‌గా మారిపోతుంది. కాబట్టి తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవాలి” అని నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. జగన్‌ పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని విమర్శించారు. “గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయాను” అని లోకే ష్ పేర్కొన్నారు.