“రా.. తేల్చుకుందాం.. మొగోడు ఎవ‌రో”

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు కేటీఆర్ మ‌రోసారి సవాల్ రువ్వారు. మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఎవ‌రు మొగోడు ఎవ‌రో తేల్చుకుందాం రావాలంటూ.. కామెంట్సు చేశారు. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి దమ్మేంటో నిరూపించుకోవాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “ఎన్నికల్లో గెలిస్తే మగాడు.. ఓడితే మగాడు కాదా?. నా సవాల్‌ను రేవంత్‌ రెడ్డి ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం” అని కేటీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు.

ఇదే స‌మ‌యంలో కేటీఆర్ వ్యక్తిగత విమ‌ర్శ‌లు కూడా చేశారు. తానేమీ.. సిఫార్సుల‌తో ను, ఎవ‌రికో సేవ‌లు చేసి.. చెంచాగిరి చేసిన ప‌ద‌వులు ద‌క్కించుకోలేద‌ని ప‌రోక్షంగా రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.
“మా అయ్య పేరు కేసీఆర్‌. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్‌ రూట్‌లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్‌ సీఎం అయ్యారు. కారు కూతలు, చిల్లర మాటలు రేవంత్‌ ఇకనైనా మానుకోవాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ హ‌యాంలో క‌ట్టిన ప్రాజెక్టులు కుంగాయే త‌ప్ప కుప్ప‌కూలి పోలేద‌ని పేర్కొన్నారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయ‌ని, అయితే.. వీటిలో 3 పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగిపోయాయ‌ని కూలిపోలేద‌ని కేటీఆర్ అన్నారు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా? అని ప్ర‌శ్నించారు.

వంద రోజుల త‌ర్వాత ఉద్య‌మ‌మే!

కాంగ్రెస్ కు 100 రోజుల స‌మ‌యం ఇచ్చామ‌ని, ఆ త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌లోకి వెళ్లి ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని కేటీఆర్ అన్నారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్‌ భరతం పడతారని కేటీఆర్‌ హెచ్చరించారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓట‌మి త‌మ‌ను బాధించింద‌ని కేటీఆర్ అన్నారు.