హ‌మ్మ‌య్య‌.. ఆ ఇద్ద‌రు గ‌ట్టెక్కేశారు.. త‌మ్ముళ్లు ఖుషీ!

బీజేపీతో క‌లిసి ముందుకు సాగేందుకు సిద్ధ‌మైన టీడీపీలో అధినేత చంద్ర‌బాబు ఒక్క‌రికే నిన్న మొన్న‌టి వ‌ర‌కు సంతోషం. వైసీపీ పాల‌న‌ను గ‌ద్దెదించేసి.. టీడీపీని గ‌ట్టెక్కించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ పొత్తు కార‌ణంగా త‌మ‌కు సీట్లు చిరిగిపోతాయ‌నేది త‌మ్ముళ్ల ఆవేద‌న‌. ఇదే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రిచింది. ఇప్పుడు కొంత క్లారిటీ వ‌చ్చింది.

ఇక‌, మ‌రీముఖ్యంగా రెండు పార్ల‌మెంటు స్థానాల్లో బీజేపీతో పొత్తు ప్ర‌తిపాద‌న‌.. టీడీపీలో క‌ల‌క‌లం రేపింది. ఈ రెండు స్థానాల‌ను బీజేపీ ప‌ట్టుబ‌డుతుండ‌డం.. వాటినే త‌మ‌కు కేటాయించాల‌ని కోరుతున్న‌ట్టు వార్త లు రావ‌డంతో ఈ రెండుస్థానాల‌పై ఆశ‌లు పెట్టుకున్న కీల‌క నాయ‌కులు త‌ర్జ‌న‌న‌భ‌ర్జ‌న‌కు గుర‌య్యారు. అయితే.. ఇప్పుడు ఈ స్థానాల‌ను ఇచ్చేది లేద‌ని.. చంద్ర‌బాబు తేల్చి చెప్ప‌డం.. ఈ రెండు స్థానాల కోస‌మే రెండు రోజుల పాటు ఆయ‌న క‌స‌ర‌త్తు చేయ‌డంతో ఈ నేత‌లు హ్యాపీగా ఫీల‌వుతున్నారు.

ఆ రెండు స్థానాలే.. విజయవాడ, విశాఖపట్నం పార్ల‌మెంటు సీట్లు. వీటిని పొత్తులో భాగంగా త‌మ కేటాయిం చాలని బీజేపీ కోరగా.. అందుకు చంద్రబాబు ఒప్పుకోలేదని తెలిసింది. విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు దగ్గరి బంధువు(వ‌ర‌స‌కు కొడుక‌య్యే), బాలక్రిష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్ ఉండడం ఇందుకు కారణం. ప్రస్తుతం గీతమ్ విద్యాసంస్థల బాధ్యతలను ఈయనే చూస్తుండగా.. గత ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

కానీ, అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ స్వింగ్ వల్ల ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం గెలిచి తీరుతాన‌ని ఆశ‌తో ఉన్నారు. ఇక‌, విజయవాడ సీటును బీజేపీకి కేటాయించే విషయంలోనూ చంద్రబాబు ఒప్పుకోలే దని తెలిసింది. విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈసారి టీడీపీ గెలవడం చాలా సులువు అని చెబుతున్నారు.

రాజధాని ప్రాంతం కావడం.. అధికార పార్టీ తీరుపై అక్కడివారు తీవ్రమైన అసమ్మతి ఉండడం వంటి కారణాలతో పాటు విజయవాడ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం బలం అధికంగా ఉండడం వంటివి ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. దీంతో ఈ రెండు స్థానాల‌ను టీడీపీ వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఆ ఇద్ద‌రు నాయ‌కులు ఖుషీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.