బీజేపీ సీట్లు- చంద్రబాబు నిర్ణయం

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు వేళ టీడీపీ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా రెండు కీల‌క నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్(క‌మ్మ సామాజిక వ‌ర్గం), క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జీలుగా నియమించారు. మరోవైపు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో 2014 సీన్ ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం కానుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి.

175 అసెంబ్లీ సీట్లన్న ఏపీలో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే… మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే స‌మ‌యంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. 6 సీట్లు బీజేపీకి కేటాయించనున్న‌ట్టు తెలిసింది. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు..

ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా 118 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. టీడీపీ – జనసేన – బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తర్వాతి జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోల 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని ఎక్కవ లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని అమిత్‌షా, నడ్డా ప్రతిపాదించారు.

ఈ క్రమంలో లోక్ సభ సీట్ల కేటాయింపుపైనే సందిగ్థత నెలకొంది. దీనిపై ‌స్పందించిన చంద్రబాబు… నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి బీజేపీ అగ్రనేతలు తీసుకెళ్లారు. పూర్తి సమీకరణల అనంతరం సీట్ల సర్దుబాటు, పొత్తుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.