పొత్తులు స‌ఫలం.. తేలాల్సింది సీట్లే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో మూడు పార్టీలు క‌లిసి వెళ్లేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నెల‌కొన్న అస్ప‌ష్ట‌త దాదాపు తొలిగిపోయింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఇప్ప‌టికే ఖ‌రారైంది. 94 స్థానాల‌ను టీడీపీ తీసుకోగా, జ‌న‌సేన 24 స్థానాల‌ను ఎంచుకుంది. ఇక‌, మూడో పార్టీ బీజేపీ క‌లిసి రావాల‌ని..ఈ రెండు పార్టీలూ తీవ్ర‌స్థాయిలో క‌స‌ర‌త్తు చేశాయి. దీనికి సంబంధించి చంద్ర‌బాబు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి అగ్ర‌నేత‌ల‌ను క‌లిసి వ‌చ్చారు.

ఇక తాజాగా గురువారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశంలో బీజేపీ అగ్ర‌నేత‌లు జేడీ న‌డ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు.. పొత్తుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ముందుకు సాగ‌నుంది. తొలుత జేపీ న‌డ్డాతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు విడివిడిగా భేటీ అయ్యారు. త‌ర్వాత‌.. రాత్రం 12 గంట‌ల స‌మ‌యంలో అమిత్‌షాతో ఇద్ద‌రూ క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఉన్న రాజ‌కయ ప‌రిస్థితులు.. ప‌రిణామాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అనంత‌రం.. పొత్తుల కోసం వేచి చూస్తున్నామ‌ని, ఓకే అంటే సీట్ల పంప‌కాలు ప్రారంభిద్దామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. దీనికి జేపీ న‌డ్డా ఓకే చెప్పి.. ఆయ‌న స్వ‌యంగా వారిని వెంట బెట్టుకుని అమిత్‌షా వ‌ద్ద‌కు తీసుకువెళ్లారు. ఇక్క‌డ జ‌రిగిన కీల‌క చ‌ర్చ‌ల్లో సీట్ల‌పై ప్రాధమికంగా దృష్టి పెట్టారు. ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. 15 అసెంబ్లీ స్థానాల‌ను బీజేపీ కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్ల‌మెంటు సీట్ల‌లో 7 నుంచి 9 కోసం ప‌ట్టుబడుతున్న‌ట్టు తెలిసింది.

అయితే.. 10 – 9 మ‌ధ్య అసెంబ్లీ సీట్లు, 4- 5 మ‌ధ్య పార్ల‌మెంటు స్థానాల‌ను ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయిందని స‌మాచారం. గ‌త 2014 ఎన్నిక‌ల్లో జ‌రిగిన ఫ‌లితాల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వివ‌రించారు. దీనిపై ఒకింత సంతృప్తి చెందినా .. రెండు రోజుల్లో దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణ‌యం తీసుకునేందుకు బీజేపీ అగ్ర‌నేత‌లు అంగీక‌రించారు.