ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్నటీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం.. బీజేపీని క‌లుపుకొని పోయేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో 57 అసెంబ్లీ స్థానాల‌కు, 22 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగులో పెట్టారు. దీనిని తేల్చుకునేందుకు.. బీజేపీతో పొత్తును క‌న్ప‌ర్మ్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఢిల్లీ చేరుకున్నారు.

బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో శుక్ర‌వారం మార్నింగ్ వారు భేటీ అవుతార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్క‌డి అగ్ర‌నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూడా.. ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లు కావాల‌నే విష‌యంపై అధిష్టానానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీ బాట ప‌ట్టిన నేప‌థ్యంలో దీనిపై ఒక క్లారిటీ రానుంది. రేపో మాపో.. పొత్తుల‌పై ఒక ప్ర‌క‌ట‌న కూడా బీజేపీ చేయ‌నుంది.

ఇక‌, తెలంగాణ విష‌యం చూస్తే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు శంఖం పూరించిన సీఎం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్ప‌టికే 17 పార్ల‌మెంటు స్థానాల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే అంశంపై దృష్టి పెట్టారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి.. ఇద్ద‌రు నుంచి ముగ్గురు చొప్పున పేర్ల‌తో ఆయ‌న డిల్లీ బాట ప‌ట్టారు. ఈ జాబితాను పార్టీ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల ముందు ఉంచి.. ఫైనల్ చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.