పొత్తు విక‌టిస్తోందా.. కారు దిగిపోతున్న నేత‌లు

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల‌ని భావించిన బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌కు షాకుల‌పై షాకులు త‌గుతున్నాయి. ముఖ్యంగా ఉన్న‌దే 17 సీట్లు కావ‌డం దీనిలోనూ హైద‌రాబాద్‌ను మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు వ‌దిలేయ‌డంతో కేవ‌లం 16 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు వ‌దిలేసుకుంటే ఎలా అనేది బీఆర్ఎస్ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలోనే పార్టీకి దూరంగా ఉండ‌డంతో పాటు.. ఒకరిద్ద‌రు పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని నిర్న‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా కోనేరు కోన‌ప్ప పేరు తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. కాంగ్రెస్‌లోకి ఒక‌రు.. బీజేపీలోకి మ‌రొక‌రు వెళ్లిపోయారు. ఇక‌, పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌, మాజీ మంత్రి కేటీఆర్‌..త‌మ కారు కేవ‌లం స‌ర్వీసింగ్‌కు మాత్ర‌మే వెళ్లింద‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. సొంత పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో.. కారు షెడ్డుకు వెళ్లింద‌ని.. ఇక రావ‌డం క‌ష్ట‌మ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి నేతలు ఎప్పుడో తట్టాబుట్టా సర్దేసుకున్నారు.

కొందరు కాంగ్రెస్‌తోనూ, మరికొందరు బీజేపీతోనూ టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యం లో పార్టీకి మరోషాక్ తగిలింది. బీఎస్పీతో పొత్తుకు కేసీఆర్ అలా త‌ల ఊపారో లేదో.. నాయ‌కులు ఇలా కాలు క‌దిపేస్తున్నారు. పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12, లేదా 15న ఆయన హస్తం గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో కోనేరుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి నడవాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయించుకోవడంపై కోనేరు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చానని, పొత్తు విషయమై తనతో మాటమాత్రంగానైనా చెప్పలేదని కోనప్ప వ్యాఖ్యానించారు. పార్టీ వీడాలని నిర్ణయించుకున్న ఆయన తాజాగా కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వ‌హించారు. ఈయ‌న బాట‌లో మ‌రింత మంది వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.