మంగ‌ళ‌గిరికి నారా లోకేష్‌.. నాలుగు వాగ్దానాలు ఇవే!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌నున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి నాలుగు వాగ్దానాలు చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు నిర్వ‌హించిన బీసీ డిక్ల‌రేష‌న్ స‌భ‌లో్ ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌నను గెలిపిస్తే.. మంగ‌ళ‌గిరికి ఏం చేయాల‌ని అనుకుంటున్న‌దీ నారా లోకేష్ వెల్ల‌డించారు.

1) కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు. ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు… మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరిస్తాం.

2) మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టిస్తాం.

3) పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు. మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు. పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్తాం.

4) అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయ‌నున్నాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో మంగ‌ళ‌గిరిలో నెగ్గి మిత్ర‌ప‌క్షానికి గిఫ్ట్‌గా ఇస్తా.