లంచం కేసుల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు సుప్రీం షాక్

మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద లంచం తీసుకునే వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు న్యాయస్థానాలు విధిస్తుంటాయి. అయితే, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం లంచాల కేసుల్లో మినహాయింపు ఉంటుంది. 1998 నాటి చట్టం ప్రకారం శాసనసభ, పార్లమెంటులో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారణ జరిపే విషయంపై కొన్ని సడలింపులున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఆ తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. లంచం కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎటువంటి మినహాయింపు లేదని సుప్రీం కోర్టు తేల్చేసింది. చట్టసభలలో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు, ఓట్లు వేసేందుకు లంచం తీసుకుంటే రక్షణ కల్పించలేమని దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చింది.

లంచం కేసుల విచారణ నుంచి ప్రజాప్రతినిధులకు మినహాయింపునిస్తూ 1998లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం కొట్టివేసింది. లంచం తీసుకున్నారు అనే ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 2012లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీత సోరేన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేసేందుకు లంచం తీసుకొని మరొక పార్టీకి ఓటు వేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిబిఐ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

అయితే, తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ మొదట ఝార్ఖండ్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును సీత ఆశ్రయించారు. దీంతో, 2019లో ఆనాటి సీజేఐ రంజన్ గొగోయ్ ల నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై మరింత అధ్యయనం చేయాలని కోరుతూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మానికి సిఫారసు చేసింది. ఆ తర్వాత ఆ వ్యవహారం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ క్రమంలోనే తాజాగా సీజేఐ డివై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ జరిపి కీలక తీర్పును వెలువరించింది.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా తీర్పు ప్రకారం రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో మినహాయింపులు లేకుండా విచారణకు హాజరు కావాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.