రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ మార‌కం విలువ‌ను పోల్చుకుంటాయి. దీని ఆధారంగానే ఎగుమతులు-దిగుమ‌తులు కూడా జ‌రుగుతాయి. దాదాపు వీటి ఆధారంగానే ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఆధార ప‌డి ఉంటుంది. ఈ క్ర‌మంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్త కూడా… దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమీ కాదు. ప్ర‌పంచ దేశాల ప‌రిణామాల‌పైనే మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

తాజాగా అమెరికా డాల‌రుతో పోల్చుకుంటే.. భార‌త కరెన్సీ దారుణంగా ప‌డిపోయింది. 90.71 రూపాయ‌ల‌కు త‌గ్గిపోయింది. అంటే.. ఒక డాల‌రుకు  మ‌న భార‌త కరెన్సీలో రూ.90.71 చెల్లించాల్సి ఉంటుంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. పైగా ఇదే తొలిసారి అని, ఇంత దారుణ ప‌త‌నాన్ని చ‌విచూడ‌డం రికార్డేన‌ని ఆర్థిక‌నిపుణులు చెబుతున్నారు. ఇదే కొన‌సాగితే మున్ముందు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. రూపాయి విలువ ప‌త‌న‌మైన‌ప్ప‌టికీ.. మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం లేద‌న్నారు. పైగా ఎగుమ‌తుల ద్వారా మ‌న‌కు అధిక ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని చెప్పుకొచ్చారు. కానీ.. భార‌త్ నుంచి ప్ర‌పంచ దేశాల‌కు జ‌రుగుతున్న ఎగుమ‌తులు.. గ‌త ఐదేళ్ల‌లో భారీగా త‌గ్గాయ‌న్నది నిపుణులు చెబుతున్న మాట‌.

ముఖ్యంగా జీఎస్టీ శ్లాబులు మార్చిన త‌ర్వాత‌.. స్వదేశీ వ‌స్తు వినిమ‌యానికి ప్రాధాన్యం పెరిగిన నేప‌థ్యంలో ఎగుమతులు క్షీణించాయి. దీంతో సీతారామ‌న్ చెబుతున్న ఫార్ములా స‌రైన‌దేనా? అనేది సందేహం. మ‌రీ ముఖ్యంగా చ‌మురు, క్రూడాయిల్‌, పామాయిల్ స‌హా ఇత‌ర చ‌మురు ఉత్ప‌త్తుల‌ను దిగుమ‌తి చేసుకునే ప‌రిస్థితే ఉంది. అదేవిధంగా విమాన ఇంధ‌నం కూడా దిగుమ‌తిపైనే ఆధార‌ప‌డి ఉంది.

ఈ నేప‌థ్యంలో దిగుమ‌తుల ధ‌ర‌లు చుక్క‌లు తాకుతున్నాయి. దీంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న‌ది వారి మాట‌. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఉప‌శ‌మ‌నాలు ప్ర‌క‌టించేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగానే ఆర్బీఐ తాజాగా రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్ల మేర‌కు త‌గ్గించింద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.