రేవంత్ కు సవాలేనా ?

తెలంగాణలో తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలు రేవంత్ రెడ్డికి పెద్ద సవాలనే చెప్పాలి. జాతీయస్థాయిలో ఎన్డీయేనే మూడోసారి అధికారంలోకి రాబోతోందని జాతీయ మీడియా సంస్థలు సర్వేలు జోస్యాలు చెబుతున్నాయి. అలాగే గెలుపు మీద నరేంద్రమోడి నూరుశాతం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇదే సమయంలో ఇండియా కూటమి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బాగా డీలా పడిపోతోంది. కూటమిలో పోటీచేయాల్సిన సీట్ల సర్దుబాటుపై నానా అవస్తలు పడుతున్నాయి.

కూటమిలోని భాగస్తులైన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్రలో శివసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సీట్ల సర్దుబాటు పెద్ద తలనొప్పిగా తయారైంది. కేరళలో సీపీఎం, సీపీఐతో సర్దుబాట్లు కుదరలేదు. ఇలాంటి తలనొప్పులు కాంగ్రెస్ కు ఇంకా తప్పలేదు. ఈ నేపధ్యంలో కూటమిలోని భాగస్తులు గెలుచుకునే సీట్లకన్నా కాంగ్రెస్ గెలుచుకోవాల్సిన సీట్లు ఎక్కువగా ఉండాల్సిన అనివార్యత పెరిగిపోతోంది. కాంగ్రెస్ ఒంటరిగానే కనీసం 150 సీట్ల మార్కును దాటకపోతే మొత్తం కూటమే ఇబ్బందులో పడటం ఖాయం.

కాంగ్రెస్ ఒంటరిగా 150 సీట్లు మార్కు దాటాలంటే హస్తం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలదే మేజర్ షేరుండాలి. నిజానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణా మీదే అందరి దృష్టిపడింది. కర్నాటక సంగతిని పక్కన పెట్టేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన పెద్ద భారం పడింది. మొత్తం 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని రేవంత్ వ్యూహం. నిజంగానే కాంగ్రెస్ తరపున 15 మంది ఎంపీలుగా గెలిస్తే అధిష్టానం దగ్గర రేవంత్ కు అతిపెద్ద ప్లస్ అవుతుందనటంలో సందేహం లేదు.

అందుకనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక యూనిట్ గా తీసుకుని అభ్యర్థుల ఎంపికలో రేవంత్, పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలపై వ్యూహాత్మకంగా రేవంత్ మైండ్ గేమ్ పెంచేస్తున్నారు. ఇప్పటివరకు రేవంత్ ప్రకటించింది మహబూ నగర్ ఎంపీ అభ్యర్ధిగా వంశీచందర్ రెడ్డిని మాత్రమే. ఎందుకంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్ధానాల్లో గెలుపును రేవంత్ వ్యక్తిగతంగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. అందుకనే ఎంపిక బాధ్యతను తానే తీసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.