మా అన్నకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడాలని వైఎస్ సునీతా రెడ్డి గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే తనకు న్యాయం జరగడం లేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సునీత పలుమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ పై సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జగన్ పాత్ర పై కూడా విచారణ జరగాలని, ఆయన నిర్దోషి అయితే వదిలేయాలని సునీత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయవద్దని సునీత రెడ్డి పిలుపునివ్వడం సంచలనం రేపుతోంది. హత్యా రాజకీయాలను ప్రేరేపించేవారు, హత్యలు చేసేవారు ప్రజాప్రతినిధులుగా ఉండకూడదని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తావు ఉండకూడదని, వంచన, మోసం చేసిన జగన్ పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఇంకా రక్షిస్తూనే ఉన్నారని, ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా కష్టాలు పెరుగుతాయని చెప్పారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సునీత పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగలేదని, అందుకే ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. వివేకా కేసులో ఐదేళ్లయినా హత్య చేసిందెవరో ఎందుకు తేలలేదని ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా పోటీ చేసి ఓడిపోయారని, తనను అణగదొక్కాలని చూసినా ఆయన రాజకీయంగా మరింత బలంగా తయారవడంతో ఆయన ప్రత్యర్థులలో ఆందోళన మొదలైందని చెప్పుకొచ్చారు.

2019 మార్చి 15న వివేకా హత్య తర్వాత మార్చురీ బయట ఉన్న తన దగ్గరకు అవినాష్ రెడ్డి వచ్చారని, నిన్న రాత్రి 11.30 వరకు పెదనాన్న నా కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, సినిమాలలో చూపించే మాదిరిగా హంతకులు మన మధ్యనే, మన పక్కనే ఉంటారని, మనం మాత్రం వారిని గుర్తించలేమని సునీత అన్నారు. వివేకాని చంపిన వారిని వదిలేస్తే ప్రజల్లో ఏం సందేశం వెళ్తుందని ఆమె నిలదీశారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదో అర్థం కావట్లేదన్నారు.