ఈ ఇద్దరు నేతలు ఏమిచేస్తారో ?

పశ్చిమగోదావరి జల్లాలోని ఇద్దరు నేతలపైనే అందరి దృష్టిపడింది. ఇద్దరు నేతలు కూడా మిత్రపక్షాలు టీడీపీ, జనసేన కు చెందిన రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలు కావటమే గమనార్హం. ఆ ఇద్దరు ఎవరంటే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ, విడివాడ రామ చంద్రరావు. ఈ ఇద్దరు కూడా టికెట్లు ఆశించి దక్కకపోవటంతో బాగా మండిపోతున్నారు. కలువపూడి ఏమో ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుండి టికెట్ ఆశించారు. విడివాడేమో తణుకు నియోజకవర్గంలో జనసేన టికెట్ ఆశించారు.

ఇపుడు విషయం ఏమిటంటే ఉండి టికెట్ ను ఎంఎల్ఏ మంతెన రామరాజుకే చంద్రబాబునాయుడు ఖాయంచేశారు. దాన్ని కలువపూడి తట్టుకోలేకపోతున్నారు. టికెట్ ఆశించి తాను పార్టీలో చాలా కష్టపడ్డానని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినట్లు చెబుతున్నారు. అసలు సిట్టింగ్ ఎంఎల్ఏ ఉండగా తనకు చంద్రబాబు టికెట్ కేటాయిస్తారని కలువపూడి ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. 2019లో వైసీపీ గాలిని తట్టుకుని మంతెన గెలిచారన్న విషయాన్ని కలువపూడి మరచిపోయినట్లున్నారు. మంతెనకు టికెట్ రద్దుచేసి తనకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.

కలువపూడిని బుజ్జగించేందుకు ఎంతమంది తమ్ముళ్ళు ప్రయత్నించినా ఆయన ఒప్పుకోవటంలేదు. అలాగే తణుకులో విడివాడ కూడా బాగా గోలచేసేస్తున్నారు. ఎందుకంటే తణుకులో విడివాడే పోటీచేయబోతున్నట్లు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణే వారాహియాత్రలో ప్రకటించారు. అప్పటినుండి విడివాడ నియోజకవర్గమంతా తిరిగి భారీగా ఖర్చులు చేసుకున్నారు. తీరాచూస్తే సీట్లసర్దుబాటులో తణుకు సీటు టీడీపీకి వెళ్ళింది. దాంతో విడివాడ మండిపోతున్నారు. చంద్రబాబు అండ్ కో తమ అధినేత పవన్ పైన ఒత్తిడి పెట్టి సీటును లాక్కున్నట్లు విడివాడ నానా గోలచేస్తున్నారు.

ఈయనను బుజ్జగించేందుకు జనసేన నేతలు, టీడీపీ నేతలు ప్రయత్నించినా సాధ్యంకావటంలేదు. కలువపూడి అయినా విడివాడ అయినా తాము ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని చేసిన ప్రకటన రెండుపార్టీల్లోను కలకలం రేపింది. టికెట్ దక్కని నేతలు ఆగ్రహంతో అనేకం మాట్లాడటం సహజమే. కాని రోజులు గడిచేకొద్దీ  ఆ కోపం తగ్గిపోతుంది. అప్పుడు బుజ్జగింపులు పనిచేస్తాయి. అయితే కొందరు మాత్రం ఎవరిని లెక్కచేయకుండా ఎన్నికల్లో పోటీచేస్తారు. మరి కలువపూడి, విడివాడ ఏమిచేస్తారో చూడాలి.