‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి రైతులు మ‌రో విజ‌యం ద‌క్కించుకున్న ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

ఏపీ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇక్క‌డ రైతులు 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చారు. ఈ రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇక్క‌డ తేడా జ‌రిగింద‌ని, అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. రాజ‌ధానిని మార్చే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ప్ర‌భుత్వం కూడా సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని కోర్టుకు తెలిపింది. అటు రైతులు, ఇటు ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదనలు విన్న కోర్టు.. దీనికి సంబంధించిన జీవోలు, నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

ల్యాండ్ పూలింగ్ ద్వారా..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు. ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీప ప్ర‌భుత్వాన్ని రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకుంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది. దీనిపైనే తాజాగా స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌త‌గిలింది.