బీజేపీలోకి కాపు.. రాయ‌దుర్గంలో హోరా హోరీ త‌ప్ప‌దా?!

వైసీపీ టికెట్ ద‌క్క‌క పోవ‌డంతో ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి చేర‌డం ఖాయ‌మైంది. తాజాగా ఆయ‌న బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విజ‌య‌వాడ‌లో క‌లిసేందుకు ప్ర‌య‌త్నించారు. బీజేపీ స‌భ‌లో పాల్గొనేందుకు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి.. త‌ను పార్టీలో చేర‌తాన‌ని చెప్పేందుకు వ‌చ్చిన‌ట్టు కాపు తెలిపారు. ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడారు. వైసిపి ని పూర్తిగా వదిలేశానని చెప్పారు.

వచ్చే ఎన్నికలలో తాను త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం రాయ‌దుర్గం నుంచే పోటీ చేస్తున్నానని రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు. అయితే, ఏ పార్టీ త‌ర‌ఫున తాను పోటీ చేసేదీ త్వరలో చెబుతానన్నారు. దీంతో ఆయ‌న బీజేపీలోకి చేర‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ కూడా సీనియ‌ర్ల కోసం వేచి చూస్తోంది. ఇదిలావుంటే, వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోచేరాలని అనుకున్నారు. మడకశిర వెళ్లి రఘువీరారెడ్డితో భేటీ కూడా అయ్యారు. రానున్న ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి, తన భార్య కాపు భారతి రెడ్డి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీలో ఉంటామని చెబుతున్నారు.

కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నా ఆ పార్టీ త‌ర‌ఫున రాయ‌దుర్గం, క‌ళ్యాణ దుర్గం టికెట్ల‌కు సీనియ‌ర్లు పోటీలో ఉన్నార‌ని తెలిసింది. దీంతో కాపు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. 2014, 2019 ఎన్నిక‌ల‌లో వైఎస్ జగన్ ఆయ‌న‌కు టిక్కెట్ ఇచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట న‌డిచిన కాపు.. పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. మంత్రి ప‌ద‌వి కూడా ఆశించారు. అయితే.. ఆయ‌న‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టిన ఐప్యాక్ సర్వేల్లో వ్య‌తిరేక ఫ‌లితం రావ‌డంతో సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు టికెట్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై కొన్నాళ్ల కింద‌టే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కాపు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ, రాజీనామా చేయ‌లేదు.

ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్‌ను తాను న‌మ్మాన‌ని.. కానీ, నమ్మించి గొంతు కోశారని అప్ప‌ట్లో కాపు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. కొన్నాళ్లు టీడీపీ లో చేరేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, ఇక్క‌డ కూడా టికెట్ల‌కు డిమాండ్ ఉండడంతో మానుకున్నారు. బీజేపీ పొత్తులు పెట్టుకుంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున పోటీ చేయవచ్చన్న ఆలోచనతో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.