నీ ‘గుడ్డు’ ప‌గులుద్ది.. మంత్రికి టీడీపీ మ‌హిళా నేత వార్నింగ్‌

ఏపీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమ‌ర్నాథ్‌కు టీడీపీ నాయ‌కురాలు.. విశాఖ జిల్లా పాయ‌కరావుపేట టీడీపీ అభ్య‌ర్థి వంగ‌ల‌పూడి అనిత తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగితే.. నీ గుడ్డు ప‌గిలిద్ది! అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌పై మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీనిపై తాను కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని అనిత చెప్పారు. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌న‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.

అస‌లేంటి వివాదం..

ఇటీవ‌ల కాలంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య వివాదాలు రాజుకుంటున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌య‌సు ప్ర‌స్తావ‌న ఎక్కువ‌గా వ‌స్తోంది. దీనిపై వైసీపీ నాయ‌కులు ఆయ‌న వృద్ధుడు అయిపోయాడ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న వ‌య‌సు అయిపోయింద‌ని.. షెడ్డుకు వెళ్ల‌డ‌మే మిగిలి ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వంగ‌ల‌పూడి అనిత‌.. స్పందిస్తూ.. చంద్ర‌బాబు వ‌య‌సు కేవలం నెంబ‌ర్ మాత్ర‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఇప్ప‌టికీ యువ‌కుడేన‌ని చెప్పారు.

అయితే.. అనిత చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి గుడివాడ రియాక్ట్ అవుతూ.. చంద్ర‌బాబు యువ‌కుడు అన్న విష‌యం నీకెలా తెలిసింది? అని వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రివ‌ర్స్ ఎటాక్ చేసిన అనిత‌.. మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాలులో ఉందన్నారు. గుడివాడ.. ముద్ద పప్పుకి తక్కువ… గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.

కోడిగుడ్డు మంత్రివి!

ఈ క్ర‌మంలో అనిత మంత్రి అమ‌ర్నాథ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. “నువ్వు కోడి గుడ్డు మంత్రివి. నీ పని అయిపోయింది. నీ నోటి దురద కార‌ణంగా జ‌గ‌న్ నీకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఐటి మంత్రి… ఒక కంపెనీ అయినా తెచ్చారా? గుడివాడ నీ స్థాయి ఏమిటి?.. నా స్థాయి ఏమిటి? ఎక్కువ మాట్లాడితే.. మేము, జనసేన సైనికులు తరిమి కొడతాం పిడత పట్టుకొని… మిడతలా ఉన్నావ్‌” అని అనిత రెచ్చిపోయారు.