అర్ధ‌రాత్రి నిర్ణ‌యం.. ఎనిమిది మందిపై అన‌ర్హ‌త వేటు!

ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సోమ‌వారం అర్ధ‌రాత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. వీరిలో వైసీపీ నుంచి న‌లుగురు, టీడీపీ నుంచి న‌లుగురు ఉన్నారు. వీరంతా పార్టీలు మారిన వారే కావ‌డం గ‌మ‌నార్మం. ఇటీవల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం రాత్రి చాలా పొద్దు పోయిన త‌ర్వాత స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పిటిషన్‌తో ఆనం రామనారాయణరెడ్డి(వెంక‌ట‌గిరి), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(ఉద‌య‌గిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరురూర‌ల్‌), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ‌)పై అనర్హత వేటు వేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదు పిటిషన్‌తో మద్దాల గిరి(గుంటూరు వెస్ట్‌), కరణం బలరాం (చీరాల‌), వల్లభనేని వంశీ(గ‌న్న‌వ‌రం), వాసుపల్లి గణేష్‌(విశాఖ సౌత్‌)పై వేటు వేశారు. దీనిని ఎలా అమ‌లు చేస్తార‌నేది చూడాల్సి ఉంటుంది.

వాస్త‌వానికి అన‌ర్హ‌త అంటే.. ఆరు సంవ‌త్స‌రాలు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌ద‌రు అభ్య‌ర్థులు దూరంగా ఉండాలి. అయితే.. గ‌త సుప్రీంకోర్టు తీర్పుల ప్ర‌కారం.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అన‌ర్హ‌త‌ల‌కు అర్థాలు మారుతున్నాయి.దీనిని బ‌ట్టి ఏపీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే విష‌యంపై స్పీక‌ర్ ఇచ్చే వివ‌ర‌ణ‌ను బ‌ట్టి చూడాలి.

ఏం జ‌రిగింది?

గ‌త ఏడాది 2023లో జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్‌ దాటి టీడీపీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికల టైంలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలకు అధికార పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్‌ కార్యాలయం వారికి నోటీసులు పంపించింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా మెలిగిన వారికి స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి.

రెండు పార్టీలకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయంలో విచారించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత స్పీకర్ తమ్మినేని 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అయితే.. ప్ర‌స్తుతం వీరిలో టీడీపీ స‌భ్యులు హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్లు ప్ర‌స్తుతం విచ‌ర‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.