కేసీయార్ కీలక సమావేశం

కేసీయార్ తన ఫాం హౌజ్ లో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో చాలాసేపు భేటీ అయ్యారట. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారం, ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులు, క్యాడర్ను నడిపించే బాధ్యతలు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయం తదితరాలపైనే చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత నలుగురితో ఒకేసారి కేసీయార్ భేటీ అవటం ఇదే మొదటిసారట.

ఎన్నికల ప్రచారం, సమన్వయం, అభ్యర్థుల ఎంపిక తదితరాల్లో కవిత పాత్ర చాలా నామమాత్రమే అని పార్టీ వర్గాలంటున్నాయి. భారమంతా ఎక్కువగా కేటీయార్, హరీష్ రావుపైనే ఉందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీయార్ బహిరంగ సభలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. కేసీయార్ బహిరంగ సభలకు పరిమితమైపోతే కేటీఆర్, హరీష్ మాత్రం నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో పాటు రోడ్డుషోలు, ర్యాలీలు, అభ్యర్ధుల ఎంపికపై సర్వేల్లో కూడా కీలకపాత్ర పోషించారు. పార్టీ తరపున సోషల్ మీడియాకు అభ్యర్ధులకు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయాన్ని కూడా కేటీయార్ , హరీషే ఎక్కువగా చూసుకున్నారు.

సరే ఎవరెంతగా కష్టపడినా, ఎన్ని వ్యూహాలు అమలు చేసినా ఎంత ప్రయత్నించినా పార్టీకి ఓటమి అయితే తప్పలేదు. కేసీయార్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కామారెడ్డిలో ఓడిపోయినా గజ్వేలులో గెలిచారు కాబట్టి పరువు నిలిచింది.  అలాగే కేటీయార్, హరీష్ ఇద్దరు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా తయారైన ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను మళ్ళీ యాక్టివ్ చేయాలని కేసీయార్ ముగ్గురుని ఆదేశించారట.

ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేయబోయే వారికి ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలతో సమన్వయం కుదర్చాలని చెప్పారట. నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించాలని చెప్పారట. ఏ అసెంబ్లీ నియోజకర్గానికి ఏ ఎంఎల్ఏ లేదా ఏ మాజీ ఎంఎల్ఏని నియమించబోయేది తొందరలోనే ఫైనల్ చేద్దామని అన్నారని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని సమావేశంలో కేసీయార్ స్పష్టంగా చెప్పారట. ముఖ్యంగా సిక్స్ గ్యారెంటీస్ అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కేసీయార్ చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.