వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని చంద్ర‌బాబు.. ఫుల్ స్కెచ్‌!

తెలుగు దేశం పార్టీలో బుజ్జ‌గింపుల ప‌ర్వం కొన‌సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి 94 సీట్లు ప్ర‌క టించిన త‌ర్వాత‌.. త‌మ‌కు సీటు ఇవ్వ‌లేదంటే.. త‌మ‌కు ఇవ్వ‌లేదంటూ.. టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబుకు మొర పెట్టుకుంటున్నారు. మ‌రికొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు టీడీపీ నేత‌ల‌పై వైపు చాలా దీక్ష‌గా చూస్తున్నారు. ఎవ‌రైనా.. ఊ.. అంటే చాలు.. పిలిచి పార్టీలో చేర్చుకుని కండువా క‌ప్పేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే.. 48 గంట‌లు గడిచినా.. ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు.

మ‌రోవైపు.. వైసీపీ వ్యూహాల‌ను ముందుగానే ఊహించిన చంద్ర‌బాబు నాయ‌కుల‌తో ఎలాంటి శ‌ష‌భిష‌లు లేకుండా.. త‌నే స్వ‌యంగా ఫోన్లు చేసి ఇంటికి పిలుస్తున్నారు. వారితో క‌లిసి భోజ‌నం చేస్తున్నారు. ఏ ప‌రిస్థితిలో 94 మందిని ఎంపిక చేయాల్సి వ‌చ్చిందో వారికి వివ‌రిస్తున్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త ఎంత ఉందో వివ‌రిస్తున్నారు. ఇలా వ‌చ్చిన వారికి ఏదో ఒక హామీని ఇచ్చి పంపిస్తున్నారు. వీటిలో నామినేటెడ్ ప‌ద‌వులు, మంత్రి ప‌ద‌వులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు..  ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వక ముందే దాదాపు 70శాతం సీట్లు ప్రకటించి మంచి ఊపుమీద టీడీపీ-జనసేన కూటమికి అసంతృప్తులు, అలకలు తీవ్ర తలనొప్పిగా మారాయి. జనసేనతో పొత్తులో భాగంగా కీలక సీట్లను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. ఐదేళ్లుగా కష్టపడి తాము పనిచేస్తుంటే.. ఇప్పుడు వేరొకరికి సీటు ఇవ్వడం ఏంటని టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. అలాంటి వారందరినీ చంద్రబాబు పిలిచి బుజ్జగిస్తున్నారు. మరికొందరు పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడంపైనా ఆయ‌న‌ అప్రమత్తమయ్యారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని బాబు చెబుతున్నారు.  మరికొందరికి మలి జాబితా వరకు వేచి చూడమని చెప్పారు. ఇంకొందరికి నియోజకవర్గం మారాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చారు. కూట‌మి ఈసారి కచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉన్న స్థానాల్లో తెనాలి ఒకటిగా ఉంద‌ని అందుకే మాజీ మంత్రి ఆల‌పాటికి ఇవ్వ‌లేక పోయామ‌ని.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌విలోకి తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు రాజేంద్ర‌ప్ర‌సాద్ వ‌ర్గీయులు చెబుతున్నారు. ఆయ‌న శాంతించ‌డాన్ని బ‌ట్టి.. దీనికి బ‌లం చేకూరుతోంది.  మొత్తానికి చంద్ర‌బాబు వైసీపీకి చాన్స్ ఇవ్వ‌కుండా ఫుల్ స్కెచ్‌తో ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.