పంప‌కాలు కొలిక్కి.. ప్ర‌చారానికి సై!

టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య సీట్ల పంప‌కాలు దాదాపు ఒక కొలిక్కి రావ‌డంతో ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈ రెండు పార్టీలూ స‌ర్వ స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ నెల 28న ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ఎన్నిక‌ల‌ ప్ర‌చార శంఖారావాన్ని పూరిం చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెంలో నిర్వ‌హించే తొలి ఉమ్మ‌డి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. ఇక్క‌డ నుంచి పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సందేశం ఇవ్వ‌డంతోపాటు.. ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌ను కూడా స‌మాయ‌త్తం చేయ‌నున్నారు. ఇక‌, నుంచి వారానికి రెండు రోజుల పాటు ఉమ్మ‌డి స‌భ‌లు.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండేలా ప‌క్కా వ్యూహం రెడీ చేసుకున్నారు.

స‌భ‌కు స‌మ‌న్వ‌య క‌మిటీ..

ఈ నెల 28న నిర్వ‌హించ‌నున్న సభకు సంబంధించి సమన్వయ టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం తాజాగా ప్రకటించాయి. ఈ మేరకు 10 మంది సభ్యులతో కమిటీని ఇరు పార్టీలు వెల్ల‌డించాయి. తెలుగుదేశం నుంచి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎం.వి.సత్యనారాయణ రాజు ఉన్నారు. జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్ప పేర్లను ప్రకటించారు. వీరు స‌భ‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని స‌క్సెస్ చేయాల్సి ఉంటుంది.

ఉమ్మ‌డి రోడ్‌షోలు..

ఎవ‌రికి వారు కాకుండా ఉమ్మ‌డిగా వెళ్లాల‌ని టీడీపీ-జ‌నసేన‌లు నిర్ణ‌యించారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు యువ‌గ‌ళం, శంఖా రావం, బాబు ష్యూరిటీ పేరుతో టీడీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. ఇక‌, జ‌న‌సేన కూడా వారాహి యాత్ర‌ల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లింది. మ‌రోవైపు వైసీపీ సిద్ధం పేరుతో స‌భ‌లు నిర్వ‌హిస్తోంది. వైసీపీని బ‌లంగా ఎదుర్కొనాలంటే.. ఉమ్మ‌డిగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మ‌డి స‌భ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌రోవైపు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఉమ్మ‌డి రోడ్ షోలు కూడా చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, క్రౌడ్‌ను నియంత్రించ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు కూడా రావ‌నే ఉద్దేశంతో ఈ విష‌యాన్ని ప్ర‌స్తుతం ఆలోచ‌న‌ల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.