చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగింది?
వేట్లపాలెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాణాసంచా తయారీ కేంద్రాల్లో పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం కూడా సుమారు 55 మంది కార్మికులు సూర్యశ్రీ బాణాసంచా తయారీ కేంద్రంలో పనులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కొందరు సమీప ఇళ్లకు వెళ్లగా, మరికొందరు తమతో తెచ్చుకున్న భోజనాన్ని అక్కడే చేశారు.
ఈ సమయంలో ఒక కార్మికుడు అలవాటు ప్రకారం బీడీ తాగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాల్చిన బీడీని నిర్లక్ష్యంగా పడేయడంతో అది గోదాములో నిల్వ ఉంచిన బాణాసంచాకు అంటుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దాంతో భారీ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది.
ఈ ఘటనలో మొత్తం 24 మంది మృతి చెందినట్లు అధికారులు శనివారం రాత్రి ప్రకటించారు. ఘటన స్థలంలోనే 18 మంది మృతి చెందగా, మార్గమధ్యంలో ఇద్దరు, ఆసుపత్రిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 12 మంది వివరాలు మాత్రమే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలను గుర్తించడం కష్టంగా ఉండటంతో డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు.
అనేక ఘటనలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు ఘటనలు సాధారణంగా మారుతున్నాయి. 2014 అక్టోబర్ 22న జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు సజీవ దహనమయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates