కేసుల మీద కేసులు ఎదురుకుని చివరి నిమిషం దాకా వాయిదాలకు లోనైన బాలీవుడ్ మూవీ ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ నిన్న సాయంత్రం నుంచే షోలు మొదలుపెట్టేసింది. కేరళ కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో అప్పటికప్పుడు థియేటర్లు ఆటలు షెడ్యూల్ చేసి ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు చేశాయి.
అప్పటికే బాగా ఆలస్యమైపోవడంతో చాలా చోట్ల ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదు. కానీ పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మకాలు బాగున్నాయి. మొదటి భాగం ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేయడంతో సీక్వెల్ మీద నిర్మాత అంతే ఆశలు పెట్టుకున్నారు. అయితే అవి నెరవేరడం గురించే సందేహాలు నెలకొన్నాయి.
బుక్ మై షోలో గంటకు సగటున 4 వేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది వసూళ్ల పరంగా కొంత శుభ సంకేతమే. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో రెస్పాన్స్ లేకపోవడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. టాక్ చూసుకుంటే మొదటి భాగం కొనసాగింపులాగే అనిపించడంతో పాటు కాన్సెప్ట్ ఇంచుమించు దానికి దగ్గరగా ఉండటం కొత్తదనం ఆశించిన ప్రేక్షకులను సంతృప్తిపరచలేకపోయింది.
అయినా సరే కొన్ని ఎపిసోడ్స్ బాగా హ్యాండిల్ చేసి, లవ్ జిహాద్ ని చూపించే క్రమంలో దర్శకుడు కామాఖ్య నారాయన్ సింగ్ కాస్త ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడంతో కొన్ని ఎపిసోడ్స్ అతిగా అనిపించాయని ఆడియన్స్ టాక్.
సోమవారానికి కేరళ స్టోరీ 2 ఏ దిశగా వెళ్తుందనే క్లారిటీ వస్తుంది. దురంధర్ తర్వాత బోర్డర్ 2 ఒక్కటే బాలీవుడ్ కు ఊరట నిచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పరిచిన నేపథ్యంలో దురంధర్ 2 రివెంజ్ వచ్చేదాకా ఇంకో రెండు వారాలు కేరళ స్టోరీ 2నే దిక్కు కానుంది.
మరి ఆ అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటుందనేది టాక్ పూర్తిగా బయటికి వచ్చాక తేలుతుంది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కేరళ స్టోరీ 3 కూడా ప్లానింగ్ లో ఉందట కానీ ఇప్పుడీ సీక్వెల్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనే దాన్ని బట్టి నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా నిర్ణయం తీసుకుంటారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates