వరల్డ్ కప్ పై వార్ ఎఫెక్ట్… ఐసీసీ ప్లాన్ B

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌పై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఆటగాళ్లు, అధికారులను సురక్షితంగా వారి స్వదేశాలకు పంపడం అంతర్జాతీయ క్రికెట్ మండలికి (ICC) ఇప్పుడు సవాలుగా మారింది. దీని కోసం ఐసీసీ తన ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసింది.

సాధారణంగా క్రికెట్ జట్లు, బ్రాడ్‌కాస్ట్ టీమ్స్ ఇతర దేశాలకు వెళ్లాలంటే దుబాయ్ వంటి గల్ఫ్ విమానాశ్రయాలను ప్రధాన ట్రాన్సిట్ పాయింట్లుగా వాడుకుంటాయి. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆ రూట్లలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అందుకే ఐసీసీ తన ట్రావెల్, లాజిస్టిక్స్ బృందాలను రంగంలోకి దించింది. దుబాయ్‌కు ప్రత్యామ్నాయంగా యూరప్, సౌత్ ఏషియా, ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా కొత్త విమాన మార్గాలను వెతికే పనిలో పడింది.

ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ మెగా టోర్నీ మార్చి 8న ముగియనుంది. ప్రస్తుతం సెమీస్ రేసులో ఉన్న జట్లతో పాటు మ్యాచ్ అధికారులు, భద్రతా సిబ్బంది క్షేమంగా ఇళ్లకు చేరడం తమకు అత్యంత ప్రాధాన్యమని ఐసీసీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నిమిషం మారుతున్న పరిస్థితులను బట్టి సెక్యూరిటీ అడ్వైజరీలను జారీ చేస్తున్నామని, ఇందుకోసం ఒక ప్రత్యేక ‘ట్రావెల్ సపోర్ట్ డెస్క్’ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మరోవైపు మ్యాచ్‌లు చూడటానికి విదేశాల నుండి వచ్చిన అభిమానులకు కూడా ఐసీసీ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ఆయా దేశాల హెచ్చరికలను గమనించాలని కోరింది. ప్రస్తుత గందరగోళం వల్ల ప్రయాణాల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యుద్ధం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా టోర్నీని విజయవంతంగా పూర్తి చేయడమే ఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, దాడుల తీవ్రత పెరగడం వల్ల గల్ఫ్ దేశాల మీదుగా విమానాలు నడపడం రిస్క్ తో కూడుకున్న పని. అందుకే విమాన సంస్థలతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో టికెట్లు బుక్ చేసే పనిలో ఐసీసీ నిమగ్నమైంది. ప్రపంచ కప్ ముగిసే సమయానికి పరిస్థితులు చక్కబడకపోతే, ఈ కొత్త రూట్ల ద్వారానే క్రికెటర్లు తమ దేశాలకు చేరుకోవాల్సి ఉంటుంది.