కేసీఆర్ సర్కారు చేసిన తప్పును చేయని రేవంత్

కీలక సమయాల్లో సీఎం స్థాయిలో ఉన్న వారు స్పందించే తీరుతో వారి రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని ఇట్టే గుర్తించొచ్చు. ఈ విషయంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తే.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విషాద వేళ.. పట్టింపులకు పోకుండా.. రాజకీయాలకు తెర తీయకుండా.. హుందాగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.

చిన్న వయసులో అనూహ్యంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. లాస్య నందిత తండ్రి.. సీనియర్ నాయకుడు.. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికైన సాయన్న మరణ వేళ.. ఆయన అంతిమ సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో జరగకపోవటం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.

కాలం కలిసి రాలేదు కానీ..కచ్ఛితంగా మంత్రి కావాల్సిన సాయన్నకు మరణించిన వేళలో అయినా కనీస మర్యాద ఇస్తూ.. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న డిమాండ్ వచ్చింది. అంతిమ సంస్కారాల సమయంలో దాదాపు రెండు గంటల పాటు ఆపేసి.. సాయన్న అభిమానులు ఆందోళన చేపట్టారు. అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు.

అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మరణించిన వేళలో.. అధికారంలో తాము ఉన్నప్పటికి అధికారిక లాంఛనాలు జరపని వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా మాత్రం సాయన్న కుమార్తె లాస్య నందిత అకాల మరణ నేపథ్యంలో సీఎం రేవంత్.. మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విషాద వేళ.. కేసీఆర్ సర్కారు చేసిన తప్పును రేవంత్ ప్రభుత్వం రిపీట్ చేయకుండా ఉండటం.. విమర్శలకు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వటం చూస్తే.. సీఎంగా ఆయనపై మరింత సానుకూలత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.