నేను నోరు విప్పడ‌మే త‌ప్పా?!: నారా భువ‌నేశ్వ‌రి

“నేను నోరు విప్ప‌డ‌మే త‌ప్పా. నేను మాట్లాడిన దానిలోనూ రాజకీయాలు చూస్తారా? రాజ‌కీయాలు చేస్తారా?” అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల చిత్తూరులో ప‌ర్య‌టించిన ఆమె.. “మా ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను.. మీ ఉద్దేశం ఏంటి? నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించారు. దీనికి స‌ద‌రు మ‌హిళ‌లు.. ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రూ పోటీ చేయండి గెలిపించుకుంటాం! అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నాయ‌కులు వేరే కోణంలో తీసుకుని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు.

చంద్ర‌బాబుకు రెస్ట్ ఇవ్వాల‌ని.. ఆయ‌న స‌తీమ‌ణే కోరుకుంటున్నార‌ని.. మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు రెస్ట్ ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అన్నారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబుకు వ్య‌క్తిగ‌త జీవితంలో ప్ర‌శాంతంగా జీవించేందుకు మ‌నమే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా సీఎం జ‌గ‌న్ కూడా ఒంగోలులో మాట్లాడుతూ.. చంద్ర‌బాబుకు రెస్టు కావాల‌ని ఆయ‌న భార్యే కోరుకుంటున్నారు.. అని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా.. ఆదిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని కోరుతున్నాన‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నారా భువ‌నేశ్వ‌రి స్పందించారు.

“నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మోహన్ నాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో మోహన్ కుటుంబ సభ్యులను భువనేశ్వ‌రి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఈ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. మోహన్ నాయుడు పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఉచిత విద్య అందిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ.. “నేను నోరు విప్పితే త‌ప్పుబ‌డుతున్నారు. ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడినా కూడా రాజ‌కీయం చేస్తారా? ఇదేం ప‌ద్ధ‌తి. మాజీ సీఎం భార్య‌కు మాట్లాడే హ‌క్కులేదా? ప్ర‌తి విష‌యాన్నీ.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన విధంగా బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావ‌డం లేదు. నా భ‌ర్త గురించి నేను మాట్లాడితే ఇలా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తారా” అని వ్యాఖ్యానించారు.