సీఎం జ‌గ‌న్ హెలికాప్ట‌ర్లు.. ర‌ఘురామ ఫిర్యాదు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం వినియోగించేలా రెండు హెలికాప్ట‌ర్ల‌ను లీజుకు తీసుకు నేందుకు ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే. దీనికి గాను ఒక్కొక్క హెలికాప్ట‌ర్‌కు 2 కోట్ల రూపాయ‌ల చొప్పున ప్ర‌జాధ‌నాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని దానిలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌జ‌ల సొమ్మును వినియోగించి విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ర‌ఘురామ స‌ద‌రు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్ర‌చారానికి స‌ర్కారు ఖ‌జానా నుంచి సొమ్ములు వెచ్చించ‌డం నియ‌మావ‌ళికి విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. హెలికాప్టర్లను లీజుకు తీసుకునే వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని.. వాటిని నిలువ‌రించాల‌ని ఆయ‌న కోరారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ వినియోగించే రెండు హెలికాప్టర్లకు నెలకు  4 కోట్ల రూపాయ‌ల చొప్పు న‌ ఖర్చు చేస్తున్నారని ర‌ఘురామ వివ‌రించారు.  వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడా నికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్య‌యాన్ని రేపు ఎన్నిక‌ల సంఘానికి చూపించాల్సి ఉంటుంద‌ని, అందుకే ముందుగానే ఈ ఎత్తుగ‌డ వేశార‌ని, వ్య‌యం నుంచి తప్పించుకోవ డానికే జగన్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించే అవ‌కాశం ఉంద‌ని ఎంపీ ర‌ఘురామ అనుమానాలువ్య‌క్తం చేశారు. హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని త‌న ఫిర్యాదులో కోరారు. మొత్తం 12 పేజీల‌తో కూడిన ఫిర్యాదును ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. మ‌రి దీనిపై ఈసీ ఎలాంటి నిర్న‌యం తీసుకుంటుందో చూడాలి.