టీడీపీలో జీఎస్‌.. వైసీపీకి భారీ దెబ్బేనా…!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో జంపింగులు కామ‌న్‌గా మారిపోయాయి. టికెట్లు ద‌క్క‌ని వారు.. త‌మ‌కు న‌చ్చ‌ని సీటును ఇవ్వ‌లేద‌ని భావిస్తున్న‌వారు.. పార్టీలు మారుతున్నారు. ఈ జంపింగులకు ఎవ‌రూ అతీతులు కాకుండా పోయారు. ఇదిలావుంటే.. వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్న గెదెల శ్రీను.. ఉర‌ఫ్ జీఎస్‌గా పిలుచుకునే యువ పారిశ్రామిక వేత్త‌.. త్వ‌ర‌లోనే టీడీపీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన జీఎస్‌.. ఇటీవ‌ల శంఖారావం స‌భ‌కు వ‌చ్చిన నారా లోకేష్‌తో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. అయితే.. కొంత ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగు చూసింది.

ఎవ‌రీయ‌న‌..
ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పల్సస్‌ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఉర‌ఫ్ జీఎస్‌గా స్థానికంగా సుప‌రిచితులు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలు, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై తన విజన్‌ను వివరిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి శ్రీనుబాబు వెళుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గాని చెందిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ, చివరి నిమిషంలో వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్య‌ర్థి ఎంవీవీ సత్యనారాయణకు మద్ధతు ప్రకటించారు.

త‌ర్వాత కాలంలో జీఎస్‌కు వైసీపీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కూడా పార్టీతో అంటీ ముట్టనట్టు గానే ఇన్నేళ్లు ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు స‌మ‌యం చేరువైన తరుణంలో ఆయన యాక్టివ్‌ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలోకి వెళతారన్న జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల శంఖారావం స‌భ‌ల్లో జీఎస్‌.. టీడీపీ నేతలతో వరుసగా సమావేశం కావ‌డం.. నారా లోకేష్ బ‌స‌కు వెళ్లి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం.. ప్రాధాన్యం సంత‌రించుకుంది.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ సీనియర్‌ నేతలు పూసపాటి అశోక్‌ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావుతోపాటు బొబ్బిలిలో బేబీ నాయనతోపాటు పలువురు కీలక నేతలతోనూ జీఎస్ ట‌చ్‌లో ఉన్నారు. టీడీపీలో చేరే క్రమంలోనే శ్రీనుబాబు ఆ పార్టీ నేతలతో సమావేశమవుతున్నట్టు తెలిసింది. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం, ఉన్న‌త విద్యావంతుడు, యువ‌కుడు కావ‌డంతో టీడీపీలోకి ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.