టీడీపీ-జ‌న‌సేన-బీజేపీ సీట్ల పంప‌కాలు కొలిక్కి?!

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ ను ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌ద్దె దించాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆమేర‌కు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో కొంత అన‌నుకూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నా.. ఆయ‌న పొత్తుల దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తును ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలూ క‌లిసి వెళ్తాయ‌ని.. టీడీపీ, జ‌న‌సేన అధినేతలు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా మాన‌సికంగా సిద్ధం చేస్తున్నారు.

అయితే.. ఈ పొత్తుల్లో కీల‌క‌మైన మ‌రో పార్టీ.. బీజేపీని కూడా చేర్చుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అనుస‌రించిన ఫార్ములాను ఆయ‌న ఇప్పుడు కూడా తెర‌మీదికి తెస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఒక‌సారి ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్ర‌నేత , కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయి.. చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. అక్క‌డ ఏం జ‌రిగింద‌నేది ఇంకా వెల్ల‌డి కాక‌పోయినా.. దాదాపు బీజేపీ పొత్తుకు అంగీక‌రించింద‌నే వాద‌న ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. దీంతో మ‌రో సారి ఈ విష‌యంపై తేల్చుకునేందుకు ఈ నెల 20, 21 తేదీల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు సంయుక్తంగా ఢిల్లీ బాట ప‌డుతున్నారు.

దీంతో బీజేపీ పొత్తు ఖ‌రారు అయ్యే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకున్న చంద్ర‌బాబు.. ఇక‌, అసెంబ్లీ సీట్ల‌ను ఎలా పంచుకోవాల‌న్న విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు సీట్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సీట్ల‌ను మూడు పార్టీలూ పంచుకోవాల్సి ఉంటుంది. ఆయా పార్టీల బ‌లాబ‌లాలు.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఈ సీట్ల పంపకాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. దీని ప్ర‌కారం.. టీడీపీ 140 అసెంబ్లీ స్థానాలు తీసుకునే అవ‌కాశం ఉంది. అదేవిధంగా పార్ల‌మెంటు స్థానాల్లో 18 సీట్ల‌ను టీడీపీ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, బీజేపీకి 10 అసెంబ్లీ, 5 పార్ల‌మెంటు, జ‌న‌సేన‌కు 25 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు సీట్లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీనిపై వ‌చ్చే నెల 10న ప్ర‌క‌టించనున్న‌ట్టు తెలిసింది.